డైసీ ఎడ్గర్ జోన్స్ ఎప్పుడైతే ఎన్టీఆర్ సరసన రాజమౌళి దర్శకత్వంలో నటించబోతుందని తెలిసిందే అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఈవిడ గురించి వెతకడం మొదలెట్టారు. అయితే RRR అఫీషియల్ ట్విట్టర్ పేజీలో సైతం డైసీ ట్విట్టర్ అకౌంట్ ట్యాగ్ చేస్తూ ఆమె ఫోటో షేర్ చేశారు. ఓ వైపు సినిమా ప్రెస్ మీట్ జరుగుతుండగానే.. ఎన్టీఆర్ అభిమానులు, RRR మూవీ ఫ్యాన్స్ డైసీ ఎడ్గర్ జోన్స్ ట్విట్టర్ అకౌంట్ మీదకు పోటెత్తారు.
ఫోటోలకు లైకులు కొట్టడం, ఆమె ఖాతాను ఫాలో అవ్వడం, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతూ వెల్ కం సందేశాలు పంపడం మొదలు పెట్టారట. ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజే కొన్ని వేల సంఖ్యలో సందేశాలు, పేజీ ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్ రావడంతో డైసీ ఎడ్గర్ జోన్స్ బెంబేలెత్తి పోయింది. క్షణం గ్యాప్ లేకుండా ట్విట్టర్ నోటిఫికేషన్లు మోత్తెక్కిపోయాయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో డైసీ ఎడ్గర్ జోన్స్ తాత్కాలికంగా తన ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసింది. తెలుగు వారు, అందులోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానం చూపిస్తే ఎలా ఉంటుందో తెలిసి డైసీ ఎడ్గర్ జోన్స్ ఆశ్చర్య పోయింది.
RRR చిత్రం బ్రిటిష్ కాలం నాటి కథతో సాగుతున్న నేపథ్యంలో నేచురాలిటీ కోసం కొందరు బ్రిటిష్ నటులను కూడా ఇందులో భాగం చేస్తున్నారు. అందులో భాగంగానే లండన్కు చెందిన డైసీ ఎడ్గర్ జోన్స్ను ఎన్టీఆర్ పోషించే కొమురం భీమ్ పాత్రకు జోడీగా ఎంపిక చేశారు. డైసీ ఎడ్గర్ జోన్స్ ఐదేళ్ల వయసులోనే నటన మొదలు పెట్టింది. తన యాక్టింగ్ టాలెంటుతో కొందరి మాత్రమే అవకాశం లభించే నేషనల్ యూత్ థియేటర్లో 14 ఏళ్ల వయసులోనే చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు కోల్డ్ ఫీట్, వార్ ఆఫ్ ది వరల్డ్స్, జెంటిల్మాన్ జాక్, సైలంట్ విట్నెస్, ఔట్ నంబర్డ్ తదితర టీవీ సిరీస్, షోల్లో నటించింది. 2018లో వచ్చిన ‘పాండ్ లైఫ్' అనే సినిమాలో కాషీ అనే పాత్ర పోషించింది. దీంతో పాటు ‘వింటర్ సాంగ్' అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది.