ఎందుకో గాని సుధీర్ఘ రాజకీయ అనుభవమున్న ముఖ్యమంత్రి 13 జిల్లాల రాష్ట్ర పాలన నిర్వహించలేని స్థాయికి దిగజారటం ఆశ్చర్యకరంగా ఉంది. దాదాపు రెండు దశాబ్ధాల కాలంలో ఒక దివంగత ముఖ్యమంత్రి కుటుంబంలో రెండు హత్యలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం, సాక్షాత్తు ఆ దివంగత ముఖ్య మంత్రి నే నీవెలా రేపు శాసనసభకు వస్తావో చూస్తానని బెదిరించిన స్వలప కాలంలోనే ఆయన హెలీకాప్టర్ ప్రమాధంలో మరణించటం ఇప్పుడు అదీ కూడా కుట్రేనా అనే అనుమానం కలగటం సహజం. అంతేకాదు సాక్షాత్తు ప్రతిపక్షనేతను అయిర్పోర్ట్ లో హత్య చేయప్రయత్నించిన దరిమిలా ఇదే ముఖ్యమంత్రి ఇదే డిజిపి వాడిన పదజాలం పూర్తిగా వారిపైనే అనుమానం కలిగేలా అనిపిస్తుంది.
ఈ సందర్భంగా తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలని ప్రతిపక్షనేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆయన అన్నారు. శుక్రవారం వైఎస్ జగన్ పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ. హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం పకడ్బందీగా జరుగుతోందని, హత్య వెనక ఎవరున్నా బయటకు తీయాలని అన్నారు. 35 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఎంపీని ఇంట్లోకి చొరబడి అతి కిరాతంగా గొడ్డలితో నరికి చంపడమనేది అత్యంత దారుణం, నీచమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఘటన తీవ్రతను కూడా పోలీసులు గుర్తించడం లేదని అన్నారు. తన కళ్ల ఎదుట ఎస్పీకి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరు బాధకరంగా ఉంది.
"చిన్నాన్న అంతటి సౌమ్యుడు ఎవరులేరు. ఆయన చనిపోతూ ఒక లెటర్ రాశారని, అందులో డ్రైవర్ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యకేసులో చాలామంది ఉన్నారు. బెడ్రూం లో అయిదు సార్లు దాడి చేశారు. తలపై గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. ఆయనను బెడ్రూం లో చంపి బాత్రూమ్ వరకూ తీసుకువచ్చారు. ఆ తర్వాత చిన్నాన్న రక్తం కక్కుకుని సహజంగా చనిపోయినట్లు చిత్రీకించేందుకు ప్రయత్నించారు. ఆయన రాసినట్లుగా చూపిస్తున్న లేఖ కూడా కల్పితమే" అని జగన్ తీవ్ర ఆవేదనతో అన్నారు.
ఇక మా నాన్నను కట్టడి చేయడం కోసం మా తాతను చంపారు. తాతను చంపిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబే. ఇక నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి రెండు రోజుల ముందు శాసనసభకు ఎలా వస్తావో చూస్తానని ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు సవాల్ చేశారు. ఆ తర్వాత నన్ను విమానాశ్రయంలో చంపాలని చూశారు. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర, కుట్ర ఉంది. వాళ్లే హత్య చేసి వాళ్లే సిట్ వేస్తే ఎలా? అలాంటి విచారణకు పవిత్రత ఉంటుందా? అందుకే రాష్ట్ర పాలనకు సంబంధంలేని కేంద్ర సంస్థ సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుంది. దయచేసి వైసిపి శ్రేణులు సంయమనం పాటించండి. దేవుడున్నాడు, దోషులను తప్పనిసరిగా శిక్షిస్తాడు" అని వైఎస్ జగన్ ఉద్వేగంతో అన్నారు.