ఏపీలో గుంటూరు ఎంపీ స్థానానికి ఓ విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓకే పార్టీ వారు కావడం విశేషం. అదేంటీ ముగ్గురూ ఒకటే పార్టీ ఏంటి అంటారా.. అంటే ఇప్పుడు కాదు లెండి. ఓ నెల క్రితం వరకూ ముగ్గురూ ఒక్క పార్టీలో ఉన్నవారే.
గుంటూరు ఎంపీగా టీడీపీ తరపున గల్లా జయదేవ్ మరోసారి బరిలో ఉన్నారు. వైసీపీ తరపున టీడీపీ నుంచి వచ్చిన మోదుగులవేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి టీడీపీ నుంచి ఆ పార్టీలోకి వచ్చిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ నిన్నమొన్నటి వరకూ ఒకే పార్టీలో ఉన్నవారే అన్నమాట.
ఓ సర్వే సంస్థ ఆంధ్రావ్యాప్తంగా 100 నియోజకవర్గాలు సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా గుంటూరు తో పాటు 15 ఎంపీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఓ అంచనాకు వచ్చింది. గుంటూరు విషయానికి వస్తే.. ఇక్కడ ప్రధాన పార్టీలు మూడూ బరిలో ఉన్నాయి.
గుంటూరు నియోజకవర్గంలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తాడికొండ, ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గాలు. ఈ సర్వే ప్రకారం గుంటూరు ఎంపీలో వైసీపీ చాలా బలంగా ఉంది. వైసీపీ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. అయితే టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా వైసీపీకి చాలా దూరంలో ఉన్నాయి. ఇక్కడ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయం నూటికి నూరు శాతం ఖాయమని ఈ సర్వే చెబుతోంది.