విజయవాడలో తెలుగుదేశం నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తమ ప్రచారం తాము చేసుకుని పోకుండా.. తమకు నచ్చని.. తమకు ఓటేయరని తెలిసిన వారిపై దౌర్జన్యాలకు సైతం దిగుతున్నారు. అంతే కాదు.. కులం పేర్లు పెట్టి మరీ దుర్భాషలాడుతూ ప్రతాపం చూపుతున్నారు.
ఇందుకు ఉదాహరణ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ. విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో మాచవరం వాకర్స్ క్లబ్ ఉంది. రోజూ వందలమంది వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. మంగళవారం ఉదయం అక్కడకు బోండా ఉమ ప్రచారానికి వెళ్లారు. అక్కడ అందరితో మాట్లాడుతూ ఓ డాక్టర్ను చూసి రెచ్పిపోయారు.
ఎందుకంటే ఆ డాక్టర్ బ్రహ్మణుడు. ఆయన మల్లాది విష్ణుకు మద్దతు ఇస్తున్నాడు. ఈ విషయం ముందే తెలుసుకున్న ఉమ.. అతన్ని చూడగానే రెచ్చిపోయాడు. నేనేంటో... నా సామర్థ్యమేంటో తెలియక మాట్లాడుతున్నావ్.. మీ సామాజిక వర్గానికి ఓట్లు వేసి ఏం సాధిస్తారు.. నీకు సిగ్గు, సంస్కారం లేదా? అంటూ తిట్ల దండకం అందుకున్నాడు.
మీ సామాజికవర్గమంతా కలిసి విష్ణుకు ఓటేస్తే.. వాడు గెలుస్తాడా...అంటూ బోండా ఉమా ఊగిపోయాడు. మీరెంత? మీ బలమెంత? మీ సామాజికవర్గాన్నంతా మీ వెంటే తిప్పుకోవడానికి ప్రయత్నిస్తే అంగీకరించనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. మళ్లీ గెలిపిస్తే ఇంకెలా ఉంటుందోనని వాకర్స్ గుసగుసలాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.