పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గాన్ని గురించి తెలియని వారు లేరు. వాస్తవానికి ఈనియోజకవర్గం అందరికీ సుపరిచితమే. అయితే, ఇప్పుడు మరింతగా వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ నుంచి జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గెలుపు చర్చ సాగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక, వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్ బరిలో నిలవగా వీరిద్దరిపైనా.. నేరుగా పవర్ స్టార్ బరిలో నిలిచారు. దీంతో ఈ నియోజకవర్గంలో గెలుపు గుర్రంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రెండు సార్లు విజయం సాధించాడు. 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో టీడీపీ నుంచి విజయం సాధించాడు. ఈయన మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడు కావడం గమనార్హం. నియోజకవర్గంలో 65 వేల కాపు ఓటుబ్యాంకు ఉంది. ఇక, ఇప్పుడు పోటీలో ఉన్న వైసీపీ నేత గ్రంధి శ్రీనివా స్, జనసేనాని పవన్, టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ముగ్గురూ కాపు సామాజిక వర్గానికి చెందిన నా యకులే. అయితే, నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఇప్పుడు వీరంతా కూడా ఏకతాటిపైకి వచ్చి.. ఏదో ఒక పార్టీకే మద్దతివ్వాలని, గెలిపించుకోవాలని తీర్మానించుకున్నట్టు సమాచారం.
అయితే, నియోజకవర్గంలో సంచలన విషయం ఏంటంటే.. క్షత్రియులకు, కాపులకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గ్రంధి శ్రీనివాస్ను పక్కన పెట్టి.. టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. 2009లోనే క్షత్రియులు తమ పంతం నెగ్గించుకు న్నారు. అప్పట్లో సిట్టింగ్గా ఉన్న గ్రంధి శ్రీనివాస్ను పక్కన పెట్టేలా అప్పటి కాంగ్రెస్ నాయకుడు, సీఎం వైఎస్పై ఒత్తిడి తెచ్చి.. ఆయనను పక్కన పెట్టించి.. ఆయన స్థానంలో పులపర్తికి టికెట్ ఇవ్వాలని, తాము స్వయంగా గెలిపించు కుంటామని ప్రకటించారు. దీంతో వైఎస్ అంగీకరించారు. పులపర్తికి టికెట్ ఇచ్చారు. దీంతో ఆయనను క్షత్రియ వర్గం భారీ మెజారిటీ తో విజయం సాధించారు. ఇక,వ్యక్తిగతంగా చూసుకుంటే పులపర్తి.. సౌమ్యుడు, కానీ, నిస్తేజంగా ఉంటాడు, ప్రజల్లో కలవడనే పేరుంది. ఇక, ఇప్పుడు పవన్ రాకతో.. ఏం జరుగుతుందనే టెన్షన్ ప్రారంభమైంది.
మరోపక్క, అధికార టీడీపీకి ఇక్కడ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పార్టీలో అసమ్మతి జోరుగా ఉంది. కీలక నేత లు ఒక్కోక్కరు పార్టీని వీడుతున్నారు. పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్న తోట భోగయ్య పార్టీకి గుడ్బై చెప్పారు. ఇక మరో కీలక నేత మునిసిపల్ చైర్మన్, యువనేత గోవిందరావు కూడా పార్టీ నుంచి నిష్క్రమించారు. ఇక వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విషయానికి వస్తే గత ఎన్నికల అనంతరం నుంచే ఆయన పకడ్బందీగా ఈ ఎన్నికల కోసం ప్లాన్ చేసుకుంటూ వస్తుండటం గమనార్హం. పార్టీ అధికారంలో లేనప్పటికి సొంతంగా నిధులు ఖర్చు చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ వస్తున్నారు.
జనసేన నుంచి పవన్ కల్యాణ్ బరిలో నిల్చోవడంతో సహజంగానే ఒక్కసారిగా ఆ పార్టీకి ఇక్కడ జవసత్వాలు వచ్చి చేరాయి. స్వల్ప కాల వ్యవధిలోనే ఆయన అభిమానులు ఆయన కోసం ప్రచారం మొదలెట్టేశారు. పవన్ కల్యాణ్ మాత్రం ఒక్కసారి మాత్రమే అది నామినేషన్ వేసిన రోజున ఇక్కడకి వచ్చి ప్రసంగించి వెళ్లారు. జనసేనాని కోసమైతే స్వచ్ఛందంగానే ఓటేసేందుకు వేలాదిమంది సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే అదే సమయంలో వైసీపీ నుంచి గ్రంధి బలంగా కనబడుతున్నాడు. దీంతో భీమవరం బుల్లోడు ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ రగిలిస్తోంది.