పటేల్ల ఉద్యమంతో స్వల్పకాలంలో దేశం దృష్టిని ఆకర్షించిన యువకుడు హార్దిక్ పటేల్. ఉద్యమంతో ఓ రేంజ్లో పాపులరయిన హార్దిక్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎన్నికల బరిలో దిగి తన సత్తా చాటుకోవాలని భావించాడు. అయితే, ఆయనకు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఓ దాడి కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన ఆయన.. ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. ఈ కేసులో శిక్షపై స్టే విధించాలన్న హార్దిక్ వినతిని గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది.
2015లో ఎమ్మెల్యే రిషికేష్ పటేల్ ఆఫీస్పై దాడి చేసిన కేసులో హార్దిక్ పటేల్కు విసానగర్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. దీనిపై స్టే విధించాలని హార్దిక్ కోరగా.. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హార్దిక్పై 24 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, అందులో రెండు దేశ ద్రోహ కేసులు కూడా ఉన్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బెయిల్పై ఉన్నా కూడా హార్దిక్ ఏదో ఒక నేరానికి పాల్పడుతున్నాడని స్పష్టం చేసింది.
మార్చి 8న తనపై ఉన్న ఈ శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ హార్దిక్ హైకోర్టును ఆశ్రయించారు. హార్దిక్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సూరత్ లాజ్పూర్ జైల్లో 9 నెలల శిక్ష అనుభవించడంతోపాటు ఆరు నెలలపాటు రాష్ట్ర బహిష్కరణ కూడా ఎదుర్కొన్నాడు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 4న నామినేషన్ల చివరి తేదీ. దీంతో ఆ కొద్ది సమయంలోనే హార్దిక్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.