గుజరాత్ పటిదార్ ఉద్యమకారుడు, హర్ధిక్ పటేల్ కు అక్కడి హైకోర్టు లో చుక్కెదురైంది.ఆయన 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటిచేయడానికి అనర్హుడంటూ క్రింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఓ దాడి కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన హర్దిక్ పటేల్... ఆ శిక్షపై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హార్దిక్ పై 24 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయని, అందులో రెండు దేశద్రోహ కేసులున్నాయని తెలిపింది.
పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్ పటేల్ కార్యాలయంపై దాడిచేశారు. ఈ కేసును విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో హార్దిక్ గతేడాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్షపడిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
మరోవైపు, ఏప్రిల్ 4వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో హార్దిక్ ఉన్నారు.గుజరాత్ లో పటిదార్ ఉద్యమాన్ని కొనసాగించిన హర్ధక్ పటేల్ ఇటివల కాంగ్రెస్ పార్టీలో చేరారు.గుజరాత్ లో పటిదార్ లు ఎక్కువగా ఉన్న మహాసాన లేదా అమ్రెలీ స్థానాల నుండి పోటి చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు .