సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో...రాజకీయ పార్టీలన్ని తమ ప్రచారాన్ని మరింత విస్తృతం చేశాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలంతా కీలక నియోజకవర్గాలను చుట్టి వచ్చేశారు. ఇక జాతీయ పార్టీల నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. తాజాగా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సైతం రంగంలోకి దిగుతున్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సైతం తన కీలక పర్యటనకు సిద్దమవుతున్నారు. ఈ ఇద్దరూ ఒకే రోజు, ఒకే చోట ప్రచారం చేస్తున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఒకే రోజు విజయవాడ, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం బెజవాడ రానున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇక రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్న వైఎస్ జగన్ ఆదివారం మైలవరంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఒకేసారి విజయవాడ చేరుకోవడం విశేషం.
ఆదివారం ఉదయం 10.45 గంటలకు ఆయన విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో రాష్ట్రస్థాయి బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత, రైతు రుణమాఫీ, కనీస ఆదాయ పథకంపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం విజయవాడ, కళ్యాణదుర్గం సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.