నటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఒక్కసారిగా కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విజయ శాంతి వరుస ట్వీట్లు చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే ఈ ట్వీట్లలో ఆమె నాగార్జున భూ అక్రమాలను ప్రస్తావించడం విశేషం.
కేసీఆర్ సర్కారు అక్రమార్కుల భరతం పడతానని చెప్పి... పెద్ద వాళ్ల జోలికి మాత్రం ఎందుకు పోవడం లేదు అంటూ హీరో నాగార్జునకు సంబంధించిన భూ వివాదాన్ని ఆమె తన ట్వీట్లలో ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన విషయాలను ట్విట్టర్ లో కోట్ చేసింది.
నాగార్జున అక్రమంగా భూములను ఆక్రమించుకున్నారంటూ అప్పట్లో కేసీఆర్ ..నాగార్జున తీరుపై మండిపడిన వీడియోను విజయశాంతి షేర్ చేసింది. రెవెన్యూ చట్ట ఉల్లంఘనలపై చర్యలు కేవలం కింది వాళ్లకే వర్తిస్తాయా లేక నాగార్జున వంటి బడా సెలబ్రిటీలకు కూడా వర్తిస్తాయా అనే విషయమై స్పష్టత ఇవ్వాలని నిలదీసింది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంశాన్ని విజయశాంతి ప్రస్తావిస్తూ.. గతంలోనూ కేసీఆర్ ఇలాగే హడావిడి చేశారని.. కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా వ్యవహరించారని సెటైర్లు పేల్చింది విజయశాంతి. నాగార్జున అక్రమంగా భూములను రెగ్యులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇపుడు రెవెన్యూ శాఖ ప్రక్షాళన సందర్భంగానైనా నాగార్జున అక్రమంగా కొన్న భూములపై చర్యలు ఉంటాయా లేవా అనే విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులు నిలదీస్తున్నారన్నట్టు విజయశాంతి ట్విట్టర్లో చెప్పింది.