ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గురించి మరోమారు వైసీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఘాటు కామెంట్లు చేశారు. ట్విట్టర్ వేదికగా బాబు తీరును ఆయన ఎద్దేవా చేశారు. బాబుకు మూడు వస్తే పాకిస్థాన్లోనూ ప్రచారం చేస్తాడని వ్యాఖ్యానించారు. ``కర్నాటక ఎలక్షన్ ప్రచారంలో రూపాయి విలువ పడిపోయిందని, పర్యావరణ పరిరక్షణలో వెనకబడిందని, దేశంలో అసమానతలు అలాగే ఉన్నాయని సొల్లు వాగాడు. పాకిస్థాన్ వాళ్లు పిలిచినా ప్రచారం చేసొస్తాడు. ఐదేళ్లు ఏపీలో పంచభూతాలను హాం ఫట్ చేసిన వ్యక్తి సిగ్గులేకుండా దేశాన్ని కించపరుస్తున్నాడు`` అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు ఓటమి భయాన్ని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ``50 శాతం వివిప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకోర్టుకు కెళ్తే అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పింది. అయినా వివిప్యాట్లన్నిటిని లెక్కించాలని డిమాండు చేస్తున్నాడు. ఎలక్షన్ అనేది ఆయన ఒక్కడి కోసం జరిగేది కాదు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలన్న స్పృహ కూడా లేదు`` అంటూ చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్రావు తీరును తప్పుపట్టారు. ``క్రిమినల్ కేసు రిజిస్టరయ్యాక కోడెలకు నొప్పి తెలిసినట్టుంది. స్పీకర్ పదవిని పచ్చ చొక్కా కార్యకర్త స్థాయికి దిగజార్చిన చరిత్ర ఇతనిది.23 మంది ఎమ్మెల్యేలను తన యజమాని చంద్రబాబు కొనుగోలు చేస్తే అనర్హులుగా ప్రకటించకుండా దళారీ లాగా కాపాడిన వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి సోది దంచుతున్నాడు.`` అంటూ ఆరోపణలు చేశారు.
సీఎం పదవిపై చంద్రబాబు వ్యాఖ్యలను సైతం మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. ``జాన్8 వరకు నేనే సీఎంని. మధ్యన ఈసీ పెత్తనం ఏంటి? అమెరికాలో ఎన్నికల తర్వాత 8 వారాలు పాత ప్రభుత్వమే కొనసాగుతుంది తెలుసా అంటూ బుకాయిస్తున్నారు. మీరు అమెరికన్ రాజ్యాంగాన్ని అనుసరించి పాలిస్తున్నారా లేక అంబేద్కర్ రాసిన మన దేశ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారా చంద్రబాబూ?`` అంటూ గాలి తీసేశారు.