తెలంగాణలో మరో మారు ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే ఆ పార్టీ జోరుకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా విపక్షాలు ముందుకు సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జత కట్టినట్లే...ఈ పరిషత్ ఎన్నికల్లోనూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని చూస్తున్నాయి. కాంగ్రెస్-టీడీపీ-సీపీఐ-టీజేఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకొని క్షేత్రస్థాయిలో ఫైట్ చేయాలని భావిస్తున్నాయి.
అధికారం అండగా టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతాయని ప్రతిపక్షాలు మథనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలిసి కట్టుగా కదలకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వంటి పరిస్థితే ఎదురుకావచ్చునని భయపడుతున్నాయి ఆయా పార్టీలు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొనేందుకు అన్ని పార్టీలు ఐక్య కూటమి కట్టాలని భావిస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ విడదలయిన నేపథ్యంలో, పోటీకి తొందరగ జట్టుకట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఆయా పార్టీల నేతలంతా చర్చించుకొని కూటమిని ఏర్పాటు చేస్తేనే...క్షేత్రస్థాయిలో ఓట్లు చీలకుండా ఉంటాయని ద్వితీయ శ్రేణి నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదిస్తోంది. అయితే, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా టీడీపీ సహా ఇతర పార్టీలతో పొత్తుకు ముందుకు రాని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనకు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.