ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో, ప్ర‌ధానంగా పోలింగ్ జ‌రిగిన త‌ర్వాత ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరును ప‌లువురు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చిస్తున్నారు. తాజాగా ముంబైలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈవీఎంలను రష్యా నుంచి హ్యాక్ చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. రష్యాకు చెందిన ఏజెంట్లు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని, అయితే దాన్ని కన్ఫర్మ్ చేయలేనన్నారు. 


ముంబైలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న చంద్ర‌బాబు అనంత‌రం కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సీపీఎం, సీపీఐ, డీఎంకే పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయవచ్చని చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే కోట్లు ముట్టజెప్పుతామని వాళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. “ఈవీఎంలు ఎక్కువగా మొరాయిస్తున్నాయి. వాటిని ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోంది. ప్రపంచంలో 18 దేశాలు మాత్రమే ఈవీఎంలను వాడుతున్నాయి. ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. కౌంటింగ్ కు 6 రోజులు పడుతుందని ఈసీ చెప్పడం హాస్యాస్పదం. ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్‌లో 7 సెకన్లు కనపడాలి. అయితే 3 సెకన్లే కనిపిస్తోంది. వీవీప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏంచేశారు? ఈవీఎంలలో లోపాలు సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరం. ఉదయం మొరాయిస్తే మధ్యాహ్నానికి సరిచేస్తున్నారు” అని విమర్శించారు.


50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని కాం గ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ సర్కారును గద్దె దింపాలని ప్రజలు కోరుకుంటున్నారని, అయితే ఈవీఎంలే ఆందోళనకు గురి చేస్తున్నాయని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఎన్నికల కమిషన్ ధృతరాష్ట్రునిలా వ్యవహరిస్తోందని ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు వెళ్తోందని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: