కొంపతీసి చంద్రబాబునాయుడు కన్ను కర్నాటక రాష్ట్ర రాజకీయాలపై పడిందా ఏమిటి ? చంద్రబాబు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే తమ్ముళ్ళల్లో ఇదే అనుమానం మొదలైంది. కర్నాటక ఎన్నికల్లో జెడి ప్లస్ కాంగ్రెస్ తరపున చంద్రబాబు ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తు ‘ఇక నుండి తరచూ కర్నాటకకు వస్తుంటా...అవసరమైతే కన్నడ భాష కూడా నేర్చుకుంటా ’  అంటూ ప్రకటించారు.

 

చంద్రబాబు కర్నాటక పర్యటనలు, కన్నడ భాష నేర్చుకోవటంపై అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, కర్నాటక సరిహద్దునే ఉన్న కుప్పం నుండి చంద్రబాబు దాదాపు 30 ఏళ్ళుగా ప్రతినిధ్యం వహిస్తున్నారు. కుప్పమంటే ఇటు తమిళనాడు, అటు కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దు. అక్కడ జనాలకు దాదాపు తమిళంతో పాటు కన్నడ కూడా వచ్చే ఉంటుంది. 30 ఏళ్ళుగా కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి చంద్రబాబుకు కూడా కన్నడ రాకపోతుందా ? అని అనుకునే వారు.

 

కానీ తాజా ప్రకటనను బట్టి చంద్రబాబుకు కన్నడ రాదని అర్ధమైపోయింది. అలాగే తరచూ కర్నాటకలో పర్యటనలు చేస్తానని కూడా చెప్పారు. ఏపి రాజకీయవేత్తకు కర్నాటకలో తరచూ పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమిటి ? అందుకే చంద్రబాబు కన్ను కర్నాటక రాజకీయాలపై పడిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

 

రేపటి కౌంటింగ్ లో గనుక తెలుగుదేశంపార్టీ ఓడిపోతే చంద్రబాబుకు ఏపిలో ఇబ్బందనే చెప్పాలి. అలాగని తెలంగాణాలో కూడా సౌకర్యంగా ఉండలేరు. మరి అక్కడా ఇక్కడా ఎక్కడా ఉండలేకపోతే మరెక్కడుంటారు ? అందుకే మిత్రుడు, కర్నాటక సిఎం కుమారస్వామితో ఏదో ఒప్పందం చేసుకునే ఉంటారనే అనుమానాలు మొదలయ్యాయి.

 

నిజానికి కర్నాటకలో ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు జనాల నుండి పెద్దగా స్పందన ఏదీ లేదనే చెప్పాలి. ఎందుకంటే, అక్కడ ప్రచారంలో కూడా  ఏపిలో రాజధాని అమరావతి గురించి, తన పాలన గురించే ఊదరగొట్టారు. అదే సమయంలో ఎక్కడ ప్రచారం చేస్తున్నా టార్గెట్ మోడి అన్నట్లే సాగుతోంది చంద్రబాబు ప్రసంగాలు. సరే కర్నాటకలో కూడా తెలుగు జనాలు బాగానే ఉన్నారు కాబట్టి బహుశా కన్నడ రాజకీయాలపై చంద్రబాబు కన్నేశారేమో అనే అనుమానిస్తున్నారు. చూద్దాం కర్నాటక జనాల అదృష్టం ఎలాగుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: