గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు గందరగోళాన్ని సృష్టించింది. విద్యార్థుల ఆత్మహత్యలతో హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.  ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ నిర్వహించాలని.. విద్యా సంవత్సరం వృధా కాకుండా ఫలితాలు ప్రకటించాలని ఆయన ఆదేశించారు. పాసైన విద్యార్థులు కోరుకుంటే వారికి గత పద్దతి ప్రకారమే ఆ ప్రక్రియ చేపట్టాలని కేసీఆర్ చెప్పారు. ఇక విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వెంటనే నిర్వహించాలని.. ఆ బాధ్యతను విద్యా శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డికి అప్పగించారు.


ఇంటర్, ఎంసెట్ పరీక్షలు పలు మార్లు వివాదాస్పదం కావడం పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పరీక్షలు వివాదాలకు తావు లేకుండా స్వతంత్ర సంస్థకు ఇచ్చే అవకాశాలను పరిశీలించాని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యా విధానం, పరీక్షల నిర్వహణపై అధ్యయనం నిర్వహించాలని.. ఆ నివేదికను తనకు సమర్పించాలని కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.


ఇక, విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరీక్షలే ముఖ్యం కాదని జీవితంలో గెలవడం ముఖ్యమని ఆయన చెప్పారు. విద్యార్థులు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రి జగదీష్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: