ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఇటు విద్యార్థుల పరంగా అటు రాజకీయంగా తనపై జరుగుతున్న ఎదురుదాడి నేపథ్యంలో...తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసకున్నట్లు తెలుస్తోంది.ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఇంటర్తో ఎంసెట్ తదితర పరీక్షల విషయంలో ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతుండడంపై ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నదని, ఈ పరిస్థితిని నివారించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం, నూతన సంస్థ రూపకల్పన అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివిధ వర్గాల సమాచారం ప్రకారం, కమిషరేట్ ఏర్పాటు చేసి పరీక్షలన్నింటినీ ఒకే వేదికగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. టెన్త్, ఇంటర్ బోర్డులను రద్దుచేసి ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఒకే కేంద్రం ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలని.. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, ఓ సీనియర్ ఐఏఎస్కు ఈ నూతన కమిషనరేట్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఈ విధానాన్ని సిద్ధం చేసి తదుపరి అమలు వ్యవహారాలను సైతం ఆయనే పర్యవేక్షించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఈ కమిషరేట్ ఏర్పాటు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. గతంలో రాజీవ్ శర్మకు విశేషమైన అనుభవం ఉంది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా పనిచేసిన రాజీవ్ శర్మ ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు కన్వీనర్గా వ్యవహరించారు. కాగా కొత్త కమిషనరేట్ రూపొదంఇచన తర్వాత ఆ బాధ్యతలు సైతం శర్మకు అప్పగిస్తారని అంటున్నారు.