ఏపీలో ఎన్నికలు ముగిశాక ఫలితాలు ఎలా వస్తాయో అన్న టెన్షన్ సీఎం చంద్రబాబును బాగా వేధిస్తోంది. పోలింగ్ ముగిసిన తీరును బట్టి మళ్ళీ టిడిపి ఏపీలో అధికారంలోకి రావడం కష్టమేనని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టిడిపి మూడున్నర దశాబ్దాల కాలంలో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈసారి టిడిపి అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ మనుగడపై కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చేసుకున్నోడికి చేసుకున్నంత అన్న సూత్రం చంద్రబాబుకి బాగా వర్తిస్తుంది. ఐదేళ్లు పాలించి ఏపీని అభివృద్ధి చేయమని ఏపీ ప్రజలు తీర్పు ఇస్తే బాబు మాత్రం అందరితోనూ గొడవలు పెట్టుకుంటూ కాలం గడిపేశారు. అటు మోడీతోనూ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో తన కావాల్సినంత వైరం పెట్టుకుని కూర్చున్నారు. ఇటు రాజకీయంగా ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బద్ధ శత్రువు. ఎన్నికలు ముగిశాక వీరంతా తనను ఓడించేందుకు పెద్ద కుట్ర చేశారని లబో దిబో అంటున్న చంద్రబాబుకు అంతకుముందు తెలంగాణ ఎన్నికల టైంలో కేసీఆర్, ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక మోడీతో పెట్టుకున్న వైరానికి ఏమని ఆన్సర్ ఇస్తారో తెలియదు.
ఇక ఎన్నికలు ముగిశాక కొద్దిరోజుల పాటు ఎన్నికల కమిషన్ను టార్గెట్గా చేసుకున్న చంద్రబాబు, టిడిపి నేతలు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి. సుబ్రహ్మణ్యంపై విరుచుకు పడుతున్నారు. పదే పదే తనపై విమర్శలు చేస్తూ తనను టార్గెట్ చేస్తూ ఉండడంతో చివరకు ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా పవర్ లెస్ సీఎం అని సుబ్రమణ్య స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన క్రమం సమీక్షల పర్యవేక్షణ అంతా సీఎస్ పరిధిలోనే ఉంటుందని ఆయన చెప్పారు. మే 23 ఫలితాల్లో వైసిపికి ఎక్కువ స్థానాలు వస్తే వైసీపీ అధినేత జగన్ మే 24న ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చని... అదే చంద్రబాబు గెలిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రమాణస్వీకారం చేసుకొనే ఛాన్స్ ఆయనకు ఉంటుందని ఆయన తెలిపారు.
టెక్నికల్గా చూస్తే ప్రస్తుతానికి చంద్రబాబు సీఎంగా కనిపిస్తున్నా... ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయడానికి వీలు లేదంటూ ప్రస్తుతం చంద్రబాబుకు ఉన్న అధికార పరిమితిని స్పష్టం చేశారు. 2014 జూన్ 8న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినందున మళ్లీ ఈ ఏడాది జూన్ వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ టిడిపి నేతలు చేస్తున్న వాదనలను సైతం ఆయన తోసిపుచ్చారు. అసలు టీడీపీ నేతలకు రాజ్యంగా విలువలు, నిబంధనలు తెలియకనా ? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఓటమి భయంతోనో లేదా ? ఎన్నికల ఫలితాలు తేడాగా ఉంటాయన్న ఆందోళనతోనో తెలియదు కాని ప్రతి విషయానికి పదే పదే అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు. ఏదేమైనా టిడిపి నేతలు చేస్తున్న అనవసర ప్రచారానికి సిఎస్ చక్కటి వివరణతో చెక్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చివరకు సీఎస్ తో కూడా చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్న ఏకైక సీఎంగా చంద్రబాబు ఆ చెత్త రికార్డును తన పేరు మీద వేసుకుంటున్నారు అన్న సెటైర్లు బాగా పడుతున్నాయి.