గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ క‌నిపించ‌కుండా పోయిన ఆరేళ్ల బాలుడు సాత్విక్ అలియాస్ సిద్దూ శ‌వ‌మై క‌నిపించాడు. దీంతో బాలుడి త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. మాచ‌ర్ల శివారులోని ఓ క్వారీ గుంత‌లో బాలుడి మృత‌దేహం ల‌భ్య‌మైంది. త‌మ బిడ్డ‌ను ఎత్తుకెళ్లి.. హ‌త్య చేశార‌ని బాలుడి త‌ల్లిదండ్రులు ఆరోపించారు. క్వారీ గుంత‌లో ప‌డి ఉన్న బాలుడి మృత‌దేహాన్నిచూసి గుండెప‌గిలేలా రోధించారు. 


అయితే బాలుడి మృతి విష‌యంలో ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి. బాలుడ్ని ఎత్తుకెళ్లి హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు ప్రాధ‌మికంగా భావిస్తున్నారు. మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గుంటూరు రైల్వే స్టేష‌న్‌లోని సీసీటీవీ ఫుటేజిల‌ను ప‌రిశీలించారు. అందులో బాలుడిని భుజంపై ఎత్తుకొని ఓ వ్య‌క్తి వెళ్తున్న దృశ్యాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి. అయితే వీడియోలో క‌నిపిస్తున్న బాలుడు సాయి సాత్విక్ కేనా..లేదా మ‌రోక‌రా అనేది స్ప‌ష్టం కావాల్సి ఉంది. 


ఈఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్న క్ర‌మంలో మాచ‌ర్ల ఫైర్ స్టేష‌న్ స‌మీపంలోని క్వారీ గుంత‌లో ఓ బాలుడి మృత‌దేహం గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాత్విక్ త‌ల్లికి చూపించారు.

ఆమె త‌మ కుమారుడిగా గుర్తించింది. ఇక ఆ త‌ల్లి బాధ‌ను చెప్ప‌టానికి మాట‌లు రావ‌డంలేదు. బోరున విల‌పించింది.  అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే.. బాలుడు హత్యకు గురయ్యాడా, ప్రమాదవశాత్తూ క్వారీలో పడ్డాడా అనే విషయాలపై క్లారిటీ రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: