ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల పేరుతో ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న హడావుడిని ఘాటుగా ఎండగట్టారు. ఈవీఎంల వల్ల ఫలితాల్లో గోల్ మాల్ జరగనుందనే అంశంపై ఆయన మండిపడ్డారు. మీ చేతకానితనం ఇప్పుడు ఈవీఎంలపై నెడుతున్నారా అని వైసీపీ నేత ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల మతిమరుపు వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఎన్నికల కమీషన్ విఫలమైందని చెప్పి ఢిల్లీ వెళ్లి అదే ఈసీపై ఫిర్యాదు చేయడం చంద్రబాబుకు మాత్రమే దక్కిందని సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. ``ఈసీ వైఫల్యం చెందిందంటారు. 150 సీట్లు వస్తాయని చెబుతారు. ఈవీఎంలు విఫలమైతో 150 సీట్లు ఎలా వస్తాయి? మీ ఓటమిని, చేతకాని తనాన్ని ఈవిఎంలపై రుద్దకండి. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఎలా గెలిచారు? చంద్రబాబు ఓటమి ఫ్రస్టేషన్లో ఉన్నారు. అందుకే ఈ మాటలన్నీ` అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు కి సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నామని ఈ సందర్భంగా సుధాకర్బాబు వెల్లడించారు.
-ఇసుక,మట్టి దోచుకున్నారు. గ్రామాలలో జన్మభూమి కమిటీలపేరుతో సర్వం దోచారు. ప్రతి కుటిల ఎత్తుగడలను వైఎస్ జగన్ నాయకత్వంలో విజయవంతంగా ఎదుర్కొన్నాం. ఐదేళ్లుగా జగన్పై దుష్ప్రచారం చేశారు.చంద్రబాబు తాబేదార్లను తయారుచేసుకుని వారితో మాట్లాడిస్తూ రాక్షసానందం పొందటం అలవాటు. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి...తాబేదార్లతో తాళాలు మోగించారు.
- టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా దిగజారి మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు.
- డేటా చోరీ చేసి టీడీపీ సేవామిత్ర యాప్ లకు ఇచ్చింది వాస్తవమా కాదా?
- ఆధార్ సమాచారం అంతా ఐటీ గ్రిడ్స్ పేరుతో దొంగిలించిన మాట నిజమా కాదా? 8 కోట్ల మంది సమాచారాన్ని దొంగిలించింది నిజం కాదా?`` అంటూ ప్రశ్నించారు.
సెలెక్టెడ్ ఆర్టిస్ట్ లతో టీడీపీ ఆఫీసులో ఇష్టారీతిగా మాట్లాడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ``ఐటీ గ్రిడ్స్ అశోక్, లోకేష్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రశ్నిస్తే ఎదురుదాడులా? అశోక్ ని ఎక్కడ దాచారు? సిట్ ఏమైంది? సిట్ రిపోర్ట్ ఏదీ?- డేటా స్కాంలో దొంగలేవరు? చంద్రబాబు ఈ విషయం లో ఎందుకు నువ్వూ, లోకేశ్ నోరువిప్పడం లేదు? ఐదేళ్లలో మీరు చేసిన ఘనకార్యాలేంటో ఒక్కటి చెప్పండి ప్రజలకు. పోలవరం అయినా,పట్టీసీమ అయినా రాయలసీమకు నీరు ఇచ్చారని చెప్పేఅంశంమైనా ఏదైనా సరే చెప్పండి. నిన్ననే మట్టితిని అనంతపురంలో చిన్నారి చనిపోయింది.మీడియా దీనిని హైలెట్ చేయాలి. పేదలకు ఆకలి తీర్చలేని చంద్రబాబు ప్రపంచ రాజధానిని నిర్మిస్తారంట.` అని మండిపడ్డారు.