కట్న దాహానికి మరో మహిళ బలైపోయింది. అదనపు కట్నం కోసం ఓ ఎన్ఆర్ఐ భర్త వేధింపులు.. అదనపు కట్నం కోసం అతడి తల్లిదండ్రుల టార్చర్ కు ఓ నిండు ప్రాణం బలైపోయింది. శ్రీలత ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త వంశీరావు అతని పేరెంట్స్ ను కఠినంగా శిక్షించాలంటూ శ్రీలత అత్తారింటి ముందు బంధువులు ఆందోళనకు చేపట్టారు. శ్రీలత అత్తింటివారు ఎలాంటి తప్పు చేయకుంటే ఇంటి నుంచి ఎందుకు పారిపోయారని ప్రశ్నిస్తున్నారు. వంశీరావు, అతడి పేరెంట్స్ వచ్చే వరకు శ్రీలత భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు శ్రీలత అత్తింటి ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజులుగా ఆందోళన చే్తున్నా వంశీరావు.. అతడి తల్లిదండ్రులు నుంచి ఎలాంటి రెస్పాండ్స్ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో ఉండి రాయబేరాలు నడుపుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీలత మరణానికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీలత కూతురు న్యాయం జరిగే వరకు శ్రీలత బంధువులకు అండగా ఉంటామని మహిళా సంఘాలు తెలిపాయి.
రామాంతపూర్కు చెందిన వంశీరావుతో శ్రీలతకు 2011లో వివాహం జరిగింది. కోటి రూపాయల కట్నంతో పాటు 55 తులాల బంగారం కూడా ఇచ్చి వారి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. 2012లో వంశీరావు శ్రీలతను తీసుకొని యూకేకు వెళ్లాడు. ఇక కొన్నాళ్ల పాటు వారి సంసారం హ్యాపీగానే సాగింది. పండంటీ కూతురు పుట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీలత కూడా జాబ్లో చేరింది.
నెలకు ఏడు లక్షలకుపైగా జీతం. జీతం మొత్తం భర్తకే ఇచ్చేది. ఏడు కోట్లు పెట్టి లండన్లో ఒక ఇల్లు కూడా తీసుకుంది. ఐతే భర్త అత్తామామలు కట్నం కోసం వేధించసాగారు. అంతేకాదు ఆడపిల్లను కన్నావంటూ సూటిపోటి మాటలతో చిత్రహింసలకు, మానసిక క్షోభకు గురిచేశారని.. వారి వేధింపుల వల్లే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.
శ్రీలత ముంబైలోని తన మేనమామ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. కాబట్టి అక్కడ ఇప్పటికే కేసు నమోదయిందని తెలిపారు మల్కాజ్గిరి పోలీసులు. ఇక వారితో మాట్లాడి కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తామని . నివేదిక ఆధారంగా చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.