మెగాస్టార్ చిరంజీవి జీవితంలో మరో కీలక మలుపు చోటుచేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన నేపథ్యంలో...చిరు పొలిటికల్ కెరిర్ ఇక ముగిసినట్లేనని కొందరు విశ్లేషించారు. ఇంకొందరు తన సోదరుడు, పవర్ స్టార్ స్థాపించిన జనసేన పార్టీకి చిరు సేవలు అందించనున్నారని జోస్యం చెప్పారు. జనసేనకు సలహాదారుగా ఉంటారని కొందరు విశ్లేషించారు. అయితే అలాంటి అడుగు వేయబోరని...ఇక నుంచి ఆయన సినిమాల వైపు ఆసక్తి చూపించనున్నారని ఇంకొందరు విశ్లేషించారు. తాజాగా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
చిరంజీవి వేసే నూతన అడుగు విద్యారంగంలోకి అడుగిడటం. మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రారంభిస్తోందని సంస్థ సీఈవో జె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా ఉంటారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు వివరించారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నామని విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేలా స్కూల్ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్-టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా తరగతులను నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జె శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వర్తమాన పోటీ ప్రపంచంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాంకేతిక అంశాలతో పాటు తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం, నైపుణ్యాలలో శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్ లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఎస్టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నారు.