జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రెండో విడత జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న అభ్యర్ధులు తమని తాము పరిచయం చేసుకుని, ఎలక్షనీరింగ్లో ఎదురైన అనుభవాలను పార్టీతో పంచుకున్నారు. అనంతరం అభ్యర్ధులను ఉద్దేశించి పవన్కళ్యాణ్ మాట్లాడుతూ పీఆర్పీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
``పీఆర్పీ సమయంలో అంతా ఆశతో వచ్చారు, ఆశయంతో ఎవరూ రాలేదు. జనసేన పార్టీ మాత్రం ఆశయాలతో ముందుకు వెళ్తుంది. నాకు ఓటమి భయం లేదు, ఫలితం ఎలా ఉంటుందనే భయం లేదు. ఎన్ని సీట్లు వస్తాయి అన్న అంశం మీద దృష్టి పెట్టలేదు. ఎంత పోరాటం చేశామన్న అంశం మీదే నా ఆలోచన. మార్పు కోసం మహిళలు చాలా బలంగా నిలబడ్డారు. గెలుస్తారా.? లేదా.? అన్న అంశం పక్కనపెట్టి భయపడకుండా వచ్చి ఓట్లు వేశారు. `` అని తన అన్న పెట్టిన పార్టీ గురించి వ్యాఖ్యానించారు.
``మార్పు మొదలైంది... అది అసెంబ్లీలో కనబడుతుంది.. ఎంత ఏంటి అనే సంగతి పక్కనపెడితే జనసేన పార్టీ బలాన్ని తక్కువగా అంచనా వేయొద్దు``అని పవన్కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జనసేన బలం తెలియదు అన్న పదం ఎవరూ మాట్లాడవద్దని, కొన్ని లక్షల మంది యువత వెంట ఉన్నారని అన్నారు. మీడియా, మందీ మార్బలం లేకుండా.. ఇంతమంది ఎన్ని కోట్లు ఇస్తే వస్తారని ప్రశ్నించారు.