ఆయనకు దూకుడెక్కువ. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిన ఆయన నోటిదురదతో అందరినీ దూరం చేసుకున్నాడు. దీంతో ఎక్కడికక్కడ వ్యతిరేకతను కొని తెచ్చుకున్నాడు. దీంతో చేతికి అందివచ్చిన గెలుపు అవకాశాన్ని కూడా చేజార్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ చర్చ అంతా కూడా నెల్లూరు జిల్లావెంకటగిరి నియోజకవర్గం గురించే సాగుతోంది. ఇక్కడ నుంచి విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.., వెంకటగిరి నియోజకవర్గంలో కొన్నిదశాబ్దాల పాటు చక్రం తిప్పిన నేదురుమల్లి కుటుంబాన్ని బలంగా ఢీకొన్న రామకృష్ణ.. 2009లో వైఎస్ జీవించి ఉన్నసమయంలో ఇక్కడ నుంచి విజయం సాధించారు.
దీంతో జిల్లాలోనే పెద్ద సంచలనంగా మారింది. అదికూడా మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మిని రామకృష్ణ ఓడించడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక, తర్వాత ఎన్నికల్లోనూ రామకృష్ణ విజయం సాధించారు. ఇక, తాజా ఎన్నికల విషయా నికి వస్తే.. ఈ దఫా కూడా తనదే గెలుపని రామకృష్ణ భావిస్తున్నాడు. బలమైన తన సామాజిక వర్గం అండగా నిలిచిందని, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా తనను రక్షిస్తాయని, హ్యాట్రిక్ దిశగా దూసుకుపోవడం ఖాయమ ని ఆయన అంచనాలు వేసుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉండడం గమనార్హం.
ఇక్కడ వైసీపీ బలం అమాంతంగా పెరిగిపోయింది. ఇక్కడ నుంచి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి పోటీ చేశారు. సీనియర్ నాయకుడు కావడం, జిల్లాపై పట్టు ఉండడంతో ఇక్కడ ఆయనకు పరిచయాలు కూడా బాగానే ఉండడం వంటి పరిణామాలు కలిసి వస్తున్నాయి. ఇక, నేదురుమల్లి కుటుంబానికి చెందిన వారసుడు నేరుదుమల్లి రాంకుమార్ కూడా వైసీపీలోనే ఉండడం కలిసి వస్తున్న పరిణామం. ఇక, జగన్ మ్యానియా వంటివి కూడా ఇక్కడ బాగా నే పనిచేశాయి. ఇదే సమయంలో కురుగొండ్ల రామకృష్ణ నోటి వాటం ఆయనకే చేటు తెచ్చిందని అంటున్నారు.
ఆయన నోటి దురుసుతో ఇప్పటికే కేడర్ చాలా మటుకు దూరమైంది. వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ శారద పార్టీకి దూరమయ్యారు. టౌన్లో ఎక్కువగా ఉన్న పద్మశాలీలతోనూ కురుగొండ్ల వివాదం పెట్టుకున్నారు. దీంతో ఆ వర్గం కూడా ఆయనకు దూరమైందని అంటున్నారు. దీంతో కురుగొండ్ల హ్యాట్రిక్ ఆశలు నెరవేరడం కల్లేనని అంటున్న నాయకులు కనిపిస్తున్నారు. ఇంకా ఫలితాలు వెలువడేందుకు పది రోజులు ఉండగానే టీడీపీ వాళ్లే తమ వాడు ఓడిపోతున్నారని చర్చించుకుంటున్నారు.