కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం ఎలగందలలో ఇంటి ముందున్న చెట్టుకింద నిద్రపోతున్న అన్నాచెల్లెళ్లపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో చెల్లి మృతి చెందింది. అన్నకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన వలిసే యల్లప్ప, కమలవ్వ దంపతులు ఉపాధి పనికోసం ఎలగంద వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి లక్ష్మీబాయి, రాము అనే ఇద్దరు కవల పిల్లలున్నారు.
అయితే ఈ ఇద్దరు పిల్లలు ఉదయం ఇంటి ముందున్న చెట్టు కింద నిద్రిస్తున్నారు. ఈక్రమంలోనే వీరికి కొద్ది దూరంలోనే ఒక ట్రాక్టర్ ఆపి ఉంది. ఆ ట్రాక్టర్ ను ఇసుక లోడ్ నింపేందుకు వాగులోకి వెళ్దామని వెక్కి తిప్పాడు డ్రైవర్. అంతే ఒక్కసారిగా ట్రాక్టర్ చిన్నారులపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలైన బాలుడిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈవిషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు అక్కడ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.