దాదాపు రెండేళ్ల క్రితం డ్రగ్స్ కేసు ఏపీ, తెలంగాణలను ఊపేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, శ్యాం కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నా, చార్మికౌర్, ముమైత్ ఖాన్, రవితేజ , తనీష్, నందు. ఇలా చాలామంది సినీ ప్రముఖులను పోలీసులు విచారించారు. దీనికోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు.
అప్పట్లో ఇదో సంచలనం.. రోజంతా టీవీల్లో ఇదే టాపిక్.. రోజుకొకరు చొప్పున విచారణ. సినీ ప్రముఖుల నుంచి గోళ్లు, రక్తం, వెంట్రుకల నమూనాల్ని కూడా తీసుకున్నారు. ఇవన్నీ చూసిన జనం ఇంకేముంది.. ఈ కేసులో చాలామందిని లోపలే వేస్తారు అని ఊహించారు.
కానీ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేశారు తెలంగాణ పోలీసులు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండేళ్లపాటు సాగిన సుదీర్ఘ విచారణ తర్వాత దాఖలు చేసిన చార్జిషీట్లలో ఎక్కడా సినీ ప్రముఖుల ప్రస్తావనే లేదు.
డ్రగ్స్కు సంబంధించి అధికారులు మొత్తం 12 కేసులు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఇటీవలే 4 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసును విజిలెన్స్, ఏసీబీ ద్వారా విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలాంటి కీలక కేసును విచారించడం ఎక్సైజ్లోని చిన్నస్థాయి అధికారుల వల్ల కాదని.. విజిలెన్స్, ఏసీబీతో విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.