నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపైనే కక్షపెంచుకున్నాడో సైకో భర్త.. ఆమె పరువుతో పైశాచికానందం పొందేందుకు ప్రయత్నించాడు. కాపురం చేయమన్నపాపానికి ఆమెకు నరకం చూపించాడు. అంతే కాదు ఆమె నగ్న చిత్రాలు తీసి సోషల్ వెబ్ సైట్లలో పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో విసిగిపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన దంపతులు తమ బిడ్డను హైదరాబాద్ లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న పెద్దిరెడ్డికిచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లయిన మరుసటి రోజు నుంచే పెద్ది రెడ్డి అసలు రూపు బయటపడింది. పెళ్లయిన నాటి నుంచి సైకోలా ప్రవర్తించాడు.
భర్త శాడిజాన్ని తాళలేక బాధితురాలు కొద్ది రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. మూడేళ్లు గడిచిపోవడంతో పెద్దిరెడ్డి తాను మారానంటూ పెద్దల సమక్షంలో అత్తమామల్ని నమ్మించి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. ఇంకేముందు మళ్లీ అసలు రంగు బయటకొచ్చింది. అతడిలో మార్పు రాలేదు కదా.. ఈ సారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇక భార్య పుట్టింటికి వెళ్లిందన్న కోపంతో కాల్ గల్స్ అంటూ అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాంట్రాక్ట్ నెంబర్లు అత్తా, మామ ఫోన్ నెంబర్లు పెట్టాడు. అతని నిర్వాకం చూసిన గ్రామస్తులు, పెద్దలు అతడ్ని జైలుకు పంపించారు. సైకోగా మారిన పెద్దిరెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.