ముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్హాసన్కు ఊహించని పరాభవం ఎదురైంది. నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కమల్ హాసన్ ప్రస్తుతం వివాదాలతో హాట్ టాపిక్గా నిలుస్తున్నాడు. ఇటీవల ఆయన ఓ ప్రచారంలో మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. దీంతో కమల్పై సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. చారిత్రక వాస్తవం గురించే తాను మాట్లాడానని పేర్కొన్నారు. నిజం చేదుగా ఉంటుందని, అదే ఔషధంగా మారి ప్రజల రుగ్మతలను నయం చేస్తుందని అన్నారు. తనమీద చేయగలిగితే అర్థవంతమైన విమర్శలు చేయాలని తన విమర్శకులకు సూచించారు.
అయితే, బీజేపీ శ్రేణులు ఇప్పటికే కమల్ వ్యాఖ్యలని తప్పు పట్టారు. అయితే రోజు కమల్ మధురైలోని తిరుప్పరకుంద్రం రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో 11 మంది వ్యక్తులు కమల్పై చెప్పులు వేసినట్టు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ లోక్ సభ ఎన్నికలకి దూరంగా ఉండగా, అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమవుతున్నాడు.
కాగా, తమిళనాడులోని తిరుపురన్కుండ్రమ్లో ఉప ఎన్నికల ప్రచారంలో కమల్ పాల్గొని ప్రసంగిస్తూ, ``అవరకురిచిలో నేను చేసిన వ్యాఖ్యలు విమర్శకులకు ఆగ్రహాన్ని కలిగించాయి. నేను ఎవరినీ వివాదంలోకి లాగలేదు. కులం గురించో లేక మతం గురించో మాట్లాడలేదు. నేను మాట్లాడింది చారిత్రక సత్యం. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నన్ను విమర్శించే వారంతా తీవ్రవాది అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలి. కావాలంటే నేను (గాడ్సేకి వ్యతిరేకంగా) ఉగ్రవాది అనే పదాన్ని ఉపయోగించి ఉండవచ్చు. కానీ అలా అనలేదు. మనవి క్రియాశీల రాజకీయాలు. వీటిలో ఎటువంటి హింసకు తావు ఉండకూడదు అని చెప్పారు. తన ప్రసంగాన్ని విమర్శకులు వారికి కావల్సినట్టుగా మార్చుకున్నారు``అని ఆయన ఆరోపించారు.