ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ మన ప్రధాని నరేంద్ర మోదీ ముఖచిత్రం తో వెలువడింది. ‘భారత విభజన సారథి’ అనే శీర్షికన కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీపై ఒక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
దీనిపై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘టైమ్ మ్యాగజైన్ విదేశీ పత్రిక. దానిలో నా గురించి కథనం రాసిన వ్యక్తి పాకిస్థానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. ఇది చాలు ఆయన విశ్వసనీయత ఏంటో చెప్పడానికి’ అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
టైమ్ మ్యాగజైన్ లో ఈ కవర్ స్టోరీని అతీశ్ తసీర్ రాశారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గతంలో కంటే ఎక్కువ విభజనకు గురవుతోంది’ అని పేర్కొన్నారు. దానిలో మూకదాడులు, యోగి ఆదిత్యనాథ్ ను యూపీ ముఖ్యమంత్రిగా నియమించడం, మాలేగావ్ పేలుడు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు లోక్సభ టికెట్ ఇవ్వడం వంటి పలు అంశాలను వివరించారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద కూడా విమర్శలు చేశారు.
‘34 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారం కోసం సోదరి ప్రియాంకను రంగంలోకి దించింది. ఇది అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్ష పదవికి ఆమె కుమార్తె చెల్సియా పోటీపడటం లాంటిదే. బలహీన ప్రతిపక్షం ఉండటం నరేంద్ర మోదీ అదృష్టమే. మోదీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా లేదు’ అని విమర్శించారు. విభజనాధికారి అంటూ టైమ్ మ్యాగ్జైన్ నరేంద్ర మోదీపై చేసిన విమర్శల మీద బీజేపీ తీవ్రంగా మండిపడింది.