మద్యం తాగొచ్చి వేధిస్తున్న కొడుకును తండ్రే చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగిన తీవ్ర కలకలం రేపుతోంది. కడప జిల్లా నుంచి పుల్లయ్య దంపతులు ముగ్గురు కొడుకులతో కలిసి పదేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. చింతల్లోని భగత్ సింగ్నగర్లో నివాసముంటున్నారు.
అయితే కొన్నాళ్ల తర్వాత వారి పెద్ద కొడుకు వెంకటరమణ తిరిగి ఊరికి వెళ్లిపోయాడు. రెండో కొడుకు శ్రీనివాస్ తల్లిదండ్రుల ఉండే ఇంటికి దగ్గర్లోని దుర్గయ్య నగర్లో నివాసముంటున్నాడు. కాగా.. చిన్న కుమారుడు ఆటోడ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఇతడు తల్లిదండ్రులతోనే నివాసముంటున్నాడు.
అయితే చిన్న కొడుకు వెంకటేశ్లర్లు మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజు ఇంటికి తాగి వచ్చేవాడు. అంతేనా తాగొచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. మొన్న శుక్రవారం తల్లి పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో రోజు లాగే ఇంటికి మద్యం తాగొచ్చాడు వెంకటేశ్వర్లు.. తలుపు తట్టాడు.
తలుపు ఎందుకు ఇంత లేటుగా తీశావంటూ తండ్రితో గొడవకు దిగాడు. అంతేనా చావబాదాడు వాడు. ఇక కొడుకు వేధింపులతో సహనం కోల్పోయిన ఆ తండ్రి పుల్లయ్య.. రెండో కుమారుడికి సమాచారం ఇచ్చాడు. దీంతో శ్రీనివాస్ ఇంటికి వచ్చి తమ్ముడితో గొడవ పడ్డాడు.
కోపంతో శ్రీనివాస్ కర్రతో.. తండ్రి పుల్లయ్య రోకలి బండతో వెంకటేశ్వర్లు తలపై మోదారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత తండ్రీ కొడుకు ఇద్దరు అక్కడ్నుంచి జంప్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని
పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.