ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అన్ని వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఏపీలో గెలిచి సీఎం కాబోతున్నారని వన్సైడ్గా తీర్పు ఇచ్చేశాయి. టీడీపీకి కొమ్ము కాసే ఏబీఎన్, టీవీ-5, లగడపాటి రాజ్గోపాల్ లాంటి వారు మినహాయిస్తే మిగిలిన సర్వేలన్ని ఏపీలో గెలిచేది వైసీపీయే అని కుండబద్దలు కొట్టేశాయి. తాజాగా ఏపీకి చెందిన ఆరా ఎక్సిట్ పోల్ సర్వే కూడా ఇక్కడ వైసీపీ గెలుస్తుందని చెప్పింది.
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 135 స్థానాలు సాధించే అవకాశం ఉందని ఆరా పోల్స్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన ఏక్సిట్ పోల్స్ సర్వేలో స్పష్టమైంది. ఆరా సర్వే వివరాలను సంస్థ ప్రతినిధి షేక్ మస్తాన్ వలి ఆదివారం మీడియాకు వివరించారు. ఈ సర్వేలో నారా ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన నలుగురిలో ఇద్దరు విజయం సాధిస్తారని చెప్పగా... మరో ఇద్దరి గెలుపు కష్టమే అని చెప్పింది. కుప్పంలో పోటీ చేసిన చంద్రబాబు భారీ మెజార్టీతో గెలవనున్నారు. అయితే ఆయన మెజార్టీ గతంలో కంటే చాలా వరకు తగ్గనుంది.
ఇక హిందూపురంలో బాబు వియ్యంకుడు బాలయ్య ఆపసోపాల మీద గెలవనున్నాడు. ఇక బాలయ్య ఇద్దరు అల్లుళ్ల గెలుపు మాత్రం సులువు కాదని ఆరా చెప్పేసింది. సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్బాబు మంగళగిరిలో గెలవటం డౌటేనని ఆరా వెల్లడించింది. మంగళగిరిలో లోకేష్ గెలుపు మీద ముందు నుంచి డౌట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసిన బాలయ్య రెండో అల్లుడు శ్రీభరత్ కూడా ఓడిపోతాడని ఆరా సర్వే చెప్పింది. ఆరా సర్వేలో టీడీపీకి కేవలం 3 ఎంపీ సీట్లే వస్తాయని తేలింది. అలాగే ఆ పార్టీ 1 ఎంపీ సీటుతో కూడా సరిపెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని స్పష్టం చేసింది.