ఆదివారం గుంటూరుక్లబ్లో వెంకయ్యనాయుడు గారికి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఒక సమావేశం జరిగింది. ఆ సభలో ఆయన మాట్లాడుతూ... ఆహ్లాదకరమైన సెటైర్లు వేశారు. '' ఎగ్జిట్ పోల్స్ చూసి ఎగిరి గంతులు వేయ కుండా, ఎగ్జాట్ పోల్స్ కోసం చూడాలి..'' అని వ్యంగ్యంగా చురకలు వేశారు.
నేతల భాష అభ్యంతరకరంగా ఉంది, రాజకీయాలు చాలా దిగజారిపోయాయని ఆవేదనగా అన్నారు. ఇలాంటి రాజకీయాలపై మీడియా,మేధావులు సమీక్షలు చేయాలని కోరారు.
'' నా రాజకీయ జీవితంలో ప్రజలు ఇచ్చిన సొమ్ముతోనే ఎన్నికలలో పోటీ చేశా, వాటిలోనే కొంత డబ్బు మిగిలేది. వాటిని పార్టీ కార్యాలయ ఖర్చులకు వినియోగించేవాళ్లం..'' అని చెప్పారు. కానీ, నేటి ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
'' ఉపరాష్ట్రపతి కాకముందు హీరో ఎన్టీఆర్లా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వీఆర్లా పాత్ర పోషిస్తున్నా..'' అని చలోక్తి విసిరారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి శివాజీ, మంత్రి కామినేని శ్రీనివాస్, యలమంచిలి శివాజీ, రైతునేస్తం ఎడిటర్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, లావు రత్తయ్య తదితరులు పాల్గొన్నారు