జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తాడని ఐదు నెలల క్రితం అందరూ ఆశించారు. తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పవన్ కు అంత సీన్ లేదని తేలిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. మరో మూడు రోజుల్లో ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంత అన్నదానిపై అందరికీ సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఈ ఎన్నికల్లో జనసేన ఘోరమైన డిజాస్టర్ షో చేయబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పకనే చెప్పాయి. పోలింగ్ ముగిసిన అప్పటి నుంచి ఏపీ ప్రజలకు ఉన్న సందేహాలను ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. ఇక మిగిలిందల్లా కనీసం పవన్ అయినా గెలుస్తాడా అన్న ఒక్క చిన్న ఆశ మాత్రమే జన సైనికులకు ఉంది.
ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పవన్ రెండు నియోజకవర్గాల్లోనూ గెలుస్తాడని జనసైనికులు ప్రచారాన్ని తెగ ఊదరగొట్టేసారు. ప్రచారం జరుగుతున్నప్పుడు ముందుగా అందరి అంచనాలు పవన్ గాజువాకలో 30 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తాడని ఉన్నాయి. భీమవరంలో కాస్త టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చాలా బలంగా ఉండడంతో ముందునుంచి భీమవరంలో ఈ సారి వైసీపీయే గెలుస్తుందని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటూ వచ్చాయి.
తీరా పోలింగ్ సరళి ముగిశాక చూసుకుంటే గాజువాకలో చివర్లో వైసీపీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి వరుసగా రెండుసార్లు ఓడిపోవడంతో ఈ సారి సానుభూతి పవనాలు వ్యక్తం కావడంతో పాటు వైసీపీ అభ్యర్థి పుంజుకోవడం, చివర్లో భారీగా డబ్బులు ఖర్చు చేయడంతో ఇక్కడ పవన్కు వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా భీమవరంతో పోలిస్తే ఇక్కడ టీడీపీ ఇంటర్నల్ సపోర్ట్ పవన్కు బాగా ఉండడంతో గాజువాకలో పవన్ స్వల్ప మెజార్టీతో అయినా బయటపడతారని జనసేన లెక్కలు వేస్తోంది.
ఇదిలా ఉంటే పవన్ భీమవరంలో గెలుపు విషయంలో మాత్రం చాలా సందేహాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ గత పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో చివర్లో సమీకరణలు మారి ఓడిపోయారు. ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు వరుసగా రెండుసార్లు గెలిచినా ఏం అభివృద్ధి చేయలేదన్న విమర్శలు ఆయనపై తీవ్రంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి భీమవరం ఓటరు స్థానికుడు అయిన గ్రంధినే కోరుకున్నారు.
ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ముందు భీమవరంలో పవన్ ఓడిపోతాడంటూ జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. వైసీపీ వాళ్లు హెచ్చు పందేలు ఇచ్చి కూడా పవన్ ఓటమిపై బెట్టింగులు కాస్తున్నారంటే పవన్కు భీమవరంలో గెలుపు ఎంత టఫ్గా ఉందో తెలుస్తోంది. ఏదేమైనా పవన్ రెండుచోట్లా గెలిస్తే సంచలనమే ? పవన్ మరి రెండు చోట్లా గెలుస్తాడా ? లేదా రెండు చోట్లా ఓడిపోతాడా ? పవన్ అసెంబ్లీలో అడుగుపెడతాడా ? లేదా ? అన్నది చూడాలి.