ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మెజార్టీ సర్వేలు తేల్చాయి. ఇక ప్రఖ్యాత మ్యాగజైన్ ఇండియాటుడే కూడా కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతున్నాయని అంచనా వేశాయి. ఇక ఇండియా టుడే తన సీట్ల లెక్కలను మంగళవారం మరింత వివరంగా వెల్లడించింది. ఏపీలో వైసీపీ, జనసేన, టీడీపీ గెలిచే ఎంపీ సీట్ల లెక్కలను కూడా వెల్లడించింది. ఇండియాటుడే వివరాల ప్రకారం ఏపీలోని మొత్తం 25 లోక్సభ సీట్లలో వైసీపీ 18 సీట్లను సులువుగా గెలుచుకోనుంది. ఇక ఆరు సీట్లలో మాత్రమే టీడీపీకి ఎడ్జ్ ఉందంటున్నా.. అక్కడ కూడా వైసీపీ నుంచి గట్టి పోటీ తప్పదని తేలింది. ఇక జనసేనకు విశాఖలో ఛాన్సులు ఉన్నాయి.
ఏపీలో వైసీపీ గెలిచే 18 ఎంపీ సీట్ల పేర్లు చెప్పిన ఇండియా టుడే టీడీపీ విషయంలో మాత్రం ఒక్క సీటు పేరు కూడా చెప్పలేదు. ఓ ఆరు స్థానాల్లో గట్టిపోటీ ఉందన్న విషయం మాత్రమే సర్వే చెప్పింది. వైసీపీ గెలిచే సీట్లలో లోక్ సభ స్థానాల వారీగా చూస్తే.. కర్నూలు - నంద్యాల - బాపట్ల - ఏలూరు - అరకు - విజయనగరం - అనకాపల్లి - కాకినాడ - అమలాపురం - ఒంగోలు - నర్సాపురం - నరసారావుపేట - హిందూపూర్ - రాజంపేట - కడప - నెల్లూరు - తిరుపతి లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఇక టీడీపీ కంచుకోట హిందూపురంలో మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ గోరంట్ల మాధవ్ వైసీపీ నుంచి గెలుస్తాడని సర్వే చెప్పింది.
ఇక టీడీపీ టఫ్ ఫైట్ ఇచ్చిన ఎంపీ సీట్లలో గుంటూరు - విజయవాడ - అనంతపురం - చిత్తూరు - మచిలీపట్నం - శ్రీకాకుళం ఉన్నాయి. అయితే ఈ సీట్లలో కూడా వైసీపీ గెలిచే ఛాన్సులు ఉన్నాయని సర్వే తెలిపింది. శ్రీకాకుళంలో రామ్మోహన్నాయుడుకు వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ రూపంలో జగన్ విసిరిన కాళింగ క్యాస్ట్ అస్త్రం బాగా పనిచేసినట్టు కనపడుతోంది. ఇక విజయవాడ, గుంటూరులలో టీడీపీ సిట్టింగ్ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని బలంగా ఉన్నా వీరికి వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ రెండు చోట్ల హోరాహోరీ పోరు జరగడానికి వైసీపీ నుంచి కూడా అన్ని విధాలా బలమైన అభ్యర్థులు రంగంలో ఉండడమే. టఫ్ ఫైట్ ఆరు చోట్ల కూడా పొరపాటుగా టీడీపీ ఒక్క సీటు గెలవకపోతే ఆ పార్టీ చరిత్రలోనే ఘోరంగా టీడీపీ సున్నా సీట్లకే పరిమితమైనట్లు అవుతుంది.
ఇక అనంతపురంలో కూడా జేసీ వారసుడికి బీసీ అభ్యర్థి రంగయ్య నుంచి బలమైన పోటీ తప్పలేదు. ఇక టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని అందరూ అనుకున్న కర్నూలు, హిందూపురం ఎంపీ సీట్లను వైసీపీ సులువుగా గెలుచుకోబోతోందని తేలింది. ఒక్క విశాఖలో మాత్రమే జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ విజయం సాధిస్తున్నారని తేల్చింది.