రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సునామీ.. జగన్ రాజకీయ ప్రత్యర్థులు తుడిచిపెట్టేస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైన బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి ఈవీఎంల లెక్కింపు వరకు కూడా ఎక్కడికక్కడ జగన్ నేతృత్వంలోని వైసీపీ దూకుడు మామూలుగా లేక పోవడాన్ని .. అప్పుడెప్పుడో 1983లో అన్నగారు నందమూరి తారక రామారావు సృష్టించిన రాజకీయ ప్రభంజనాన్ని గుర్తు చేస్తోంది. అప్పట్లో అంటే 1982లో పార్టీని పెట్టిన అన్నగారు తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో వ్యూహాత్మకంగా గెలుపొందారు. రంగులేసుకుని తైతక్కలాడే వారు కూడా రాజకీయాలకు పనికి వస్తారా? అన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను అపహాస్యం చేస్తూ.. ప్రజలు అన్నగారి వెంట నడిచారు.
హేమాహేమీలైన కాంగ్రెస్ నేతలను మట్టి కరిపించారు ప్రజలు. ఇప్పుడు కూడా అదే రీతిలో జగన్ ప్రభంజనాన్ని సృష్టించారు. వాస్తవానికి ఇప్పుడు వస్తున్న ఫలితాల ట్రెండ్ను బట్టి కనీసం 150 కి తగ్గకుండా వైసీపీ సీట్లను తన బుట్టలో వేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నిజానికి ఎవరూ ఊహించని పరిణామం. ప్రజల తీర్పు ఇలా కూడా ఉంటుందా? అనే రేంజ్లో సాగిన ఫలితాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురి చేశాయి. ఎక్కడికక్కడ ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా నిర్ణయం ముందు నేనే మగాణ్ని.. నాకన్నా తెలివిగలవారు, నాకన్నాసీనియర్లు లేరని చెప్పుకొన్ని చంద్రబాబు టీం పూర్తిగా చతికిలప డింది.
ఈ పరిణామంతో ఎగ్జిట్ పోల్స్ కూడా చిన్నబోయాయి. నిజానికి ఈ నెల 19న అంటే మూడు రోజుల ముందుగా ఏపీలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా జగన్కుఎవరూ ఇన్ని మార్కులు వేయలేదు. ఆయన గెలుపు ఖాయమని ఘంటా పథంగా చెప్పిన అనేక సర్వేలు కూడా కేవలం 133 సీట్ల దగ్గరే ఆగిపోయాయి. కానీ, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫలితాలను చూస్తే.. మాత్రం జగన్ ప్రభంజనంతోఏపీ తడిచిపోయింది. ప్రజలు జగన్ను తమ గుండెల్లో దాచుకున్న విషయం, ఆయనపట్ల చూపించిన ఔదార్యం వంటివి స్పష్టంగా కనిపించాయి. ఎక్కడికక్కడ అన్నగారు ఎన్టీఆర్ సృస్టించిన ప్రభంజనాన్ని మించి జగన్ దూసుకుపోయారు. దటీజ్ జగన్ అని అనిపించారు.