కౌగిలించుకుంటేనే కడుపవుతుందా! మరీ విడ్దూరం ఈ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ మాటలు! తన కాబినెట్ మంత్రి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూపై పంజాబ్ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సిద్దూనే కారణం అని ఆయన బల్లగుద్ది చెపు తున్నారు.
పంజాబ్లోని 13 లోక్సభ స్థానల్లో ఏ ఒక్కస్థానంలో కాంగ్రెస్ ఓడినా అందుకు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూనే కారణమని సీనియర్ నేత లాల్ సింగ్ ఆరోపించిన రెండు రోజులకు కెప్టెన్ కూడా సిద్దూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పాకిస్థాన్ వెళ్లిన నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్ ను ఆలింగనం చేసుకున్నారు (కౌగిలించుకున్నారు) ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో నవ్జ్యోత్ సింగ్ సిద్ధూపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
అయితే ఇప్పుడు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్ను కౌగిలించుకోవడమే ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచిందని కెప్టెన్ అమరిందర్ అభిప్రాయపడ్డారు. భారతీయులు, ముఖ్యంగా సైనికులు నవ్జ్యోత్ సింగ్ సిద్దూ పాక్ ఆర్మీ చీఫ్ను కౌగిలించుకోవడాన్ని అస్సలు అంగీకరించరని అయన అన్నారు.
"భారతదేశం లౌకిక దేశం.. అందరూ ఆ సెక్యూలర్ స్థాయిని పాటించాలి. భారతీయులు, ముఖ్యంగా సైనికులు పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగిలించుకోవడం సహించరు. నేను మొదటి రోజు నుంచి దీనివల్ల నష్టం ఎదురుకుంటామని చెబుతున్నాను" అని కెప్టెన్ అమరిందర్ సింగ్ అన్నారు.