సరిహద్దు రాష్ట్రం, నిత్యం ఆందోళనకు సుపరిచిత చిరునామా అయిన జమ్ముకశ్మీర్లో మరోమారు బీజేపీ ఆధిక్యం సాధించింది. మొత్తం ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో మూడింట బీజేపీ గెలుపొందగా...మరో మూడు ఇతరులు కైవసం చేసుకున్నారు. అత్యంత ఆసక్తికరంగా అనంత్నాగ్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మెహబూబా ముఫ్తీ విజయం సాధించారు. ఓటమి అనంతరం ఆమె, కాంగ్రెస్ పార్టీకి విజయాలు కావాలంటే అమిత్ షా లాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడటం చర్చనీయాంశంగా మారింది.
పీడీపీ నుంచి ముఫ్తీ పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున గులామ్ అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున హస్నైన్ మసూది, బీజేపీ తరఫున సోఫి మొహమ్మద్ యూసఫ్ పోటీ చేశారు. ప్రత్యర్థి, నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి హస్నాయిన్ మసూది చేతిలో ఓటమి పాలయిన మెహబూబా ముఫ్తీ ఈ క్రమంలో తన ఓటమిని అంగీకరించిన మెహబూబా ముప్తీ, దేశ వ్యాప్తంగా ఎన్డీఏ విజయబావుటా ఎగురవేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. కాగా ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓ అమిత్ షా కావాలన్నారు. ఈ విజయం బీజేపీ, వారి మిత్ర పక్షాలదని పేర్కొన్న ముఫ్తీ కాంగ్రెస్, యూపీఏ కూటమి ఓటమిని పరోక్షంగా ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా భారీ విజయాలు నమోదు చేసుకుంటున్న బీజేపీని మెహబూబా అభినందించారు. ‘‘చారిత్రక ప్రజా తీర్పు పొందినందుకు నరేంద్ర మోదీ గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘చారిత్రక ప్రజా తీర్పు పొందింనందుకు అభినందనలు నరేంద్ర మోదీ గారూ. నేడు తప్పకుండా బీజేపీ, దాని మిత్ర పక్షాలదే. ఓ అమిత్ షాను సంపాదించుకోవలసిన సమయం కాంగ్రెస్కు ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు. ముఫ్తీ ట్వీట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.