ఏపీలో టీడీపీకి అధికారిక పదవులు తగ్గిపోనున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీ సంఖ్యాబలం తగ్గిపోవడమే దీనికి కారణం. వైసీపీ ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవడంతో ఎమ్మెల్యేల ద్వారా ఎంపికయ్యే రాజ్యసభ సీట్లతో పాటు ఎమ్మెల్సీ పదవులు ఇక టీడీపీకి రావు. టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో ? ఎంతమంది జంప్ చేస్తారో ? తెలియదు. కనీసం ఆరేడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేసేందుకు కాచుకుని కూర్చొని ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీలతో పాటు ఇదే ఊపులో జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించి స్టేట్ మొత్తం స్వీప్ చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇక ప్రస్తుత సంఖ్యాబలంతో ఆ పార్టీ ఒక్క రాజ్యసభ సీటును కూడా దక్కించుకునే అవకాశం లేదు. నవ్యాంధ్రకు 4 రాజ్యసభ సీట్లు కేటాయించారు. 175 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్న రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.
ప్రస్తుతం టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఉండడంతో ఈ సారి రాజ్యసభ గాని... ఎమ్మెల్సీ సీట్లు కాని రావు. ఇక ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా, గవర్నర్ కోటా కింద అధికార పార్టీకి ఎక్కువ ఎమ్మెల్సీలు వస్తాయి. వీటిలో అత్యధిక భాగం ఇకపై వైసీపీకి దక్కనున్నాయి. ఆ పార్టీ కోసం పనిచేసిన వారిలో మరికొంత మందికి పదవులు రానున్నాయి. ఓవరాల్గా ఐదేళ్ల పాటు వైసీపీలో పదవుల కోలాహాలమే ఉండనుంది.