సంస్థలో అక్రమాలు, ఫోర్జరీ అభియోగాలు ఎదుర్కుంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో రవిప్రకాశ్ ఆంధ్రప్రదేశ్లో తలదాల్చుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అండతో రవిప్రకాశ్ సేఫ్గా ఇక్కడ ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఏపీ నుంచి జంప్ అయినట్టు సైబరాబాద్ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ నుంచి మరో ప్రాంతానికి జారుకొన్నట్టు సైబర్క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్ర, లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం రవిప్రకాశ్ తన అడ్డాను ఏపీ నుంచి మార్చేసుకొన్నట్టు పోలీసులకు సమాచారం అందినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ గురించి గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు రవిప్రకాశ్, శివాజీపై నమోదైన రెండు కేసుల విచారణ వేగవంతం కానున్నది. ఇప్పటికే పోలీసులు జారీచేసిన 160 సీఆర్పీసీ, 41-ఏ సీఆర్పీసీ నోటీసులను తీసుకొనేందుకు నిరాకరించిన రవిప్రకాశ్, శివాజీ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఎదుర్కుకొంటున్నారు. చట్టంలో ఉన్న అంశాలకు అనుగుణంగా పోలీసులు ముందుకు సాగుతుండటంతో రవిప్రకాశ్, శివాజీ అరెస్టు తప్పనిసరిగా మారింది. మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్వో మూర్తి గురువారం 12వ రోజు విచారణకు హాజరయ్యారు. రవిప్రకాశ్ కోసం సైబరాబాద్ సైబర్క్రైంకు చెందిన మూడు బృందాలు గాలిస్తున్నాయి.
సైబర్క్రైం నేరాలతోపాటు చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదై పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్... ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆయా కేసుల్లో విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్క్రైం పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా రవిప్రకాశ్ తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు వివిధ రాష్ర్టాల్లో గాలిస్తున్నాయి. కాగా, తనకు ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానికి కోర్టుకు నిరాకరించింది.