ఏపీలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లోనే చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో అతి తక్కువ మందికి మినహా మిగిలిన వారికి డిపాజిట్లు కూడా రాలేదు. ఏపీలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అసెంబ్లీకి గాని, లోక్సభకు గాని ఖాతాయే తెరవలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్న బొత్స సోదరుడు, కేఈ ఫ్యామిలీ, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణతో పాటు కర్నూలు జిల్లాలో కొన్ని సీట్లలో మాత్రం మంచి ఓట్లు వచ్చాయి. అంతకు మించి గత ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిందేమి లేదు.
రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ తాను ప్రధానమంత్రి అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతానన్న హామీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్లో పేరున్న నాయకులు అంతా ఇప్పుడు తమ దారి తాము చూసుకున్నారు. కన్నా లాంటి వాళ్లు బీజేపీలోకి వెళ్లిపోయారు. బొత్స లాంటి నేతలు వైసీపీలోకి వెళితే.. కోట్ల ఫ్యామిటీ టీడీపీలోకి వెళ్లిపోయింది.
ఇక ఈ ఎన్నికల్లో ఒంటరిపోరు చేసినా ఆ పార్టీపై ఎవ్వరికి ఎలాంటి అంచనాలు, ఆశలు లేవు. అందుకు తగ్గట్టుగానే ఈ ఎన్నికల్లో అసలు వైసీపీ సునామీ ముందు టీడీపీ వాళ్లే ఆగలేకపోతే ఇక కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది. జనసేన లాంటి పార్టీ అధ్యక్షులే రెండు చోట్లా ఓడిపోయారు. అయితే అనూహ్యంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోటీ చేసిన కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ ఒకింత సంచలనమే క్రియేట్ చేసింది. ఇక్కడ రఘువీరా ఓడిపోయారు.
ఆయన మూడో స్థానంలో ఉన్నా 28, 662 ఓట్లు వచ్చాయి. ఈ విధమైన ఓట్లు రికార్డే. రఘువీరా సొంత ఇమేజ్ తో పాటు ఆయన గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి... మంత్రిగా పనిచేసిన అభివృద్ధి కూడా ఆయనకు ఇన్ని ఓట్లు తెచ్చిపెట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ శైలజానాథ్కు శింగనమల నియోజకవర్గంలో కేవలం 1325 ఓట్లు మాత్రమే వచ్చాయి రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గం మడకశిరలో 6,299 ఓట్లు రావడం కూడా విశేషమే.