ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికపరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి తెలిపారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థిక సాయం అవసరముందని ప్రధానిని అభ్యర్థించాను. ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రధానికి తెలిపాను. రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారనుకుంటున్నానని, ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటానని, రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే నాటికి ₹ 97000 కోట్లు అప్పులు ఉంటే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ₹ 257000 కోట్లకు అప్పలు చేరాయని సమాచారం.
"మద్యపాన నిషేధంపై ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం. మేనిఫెస్టో ను పవిత్ర గ్రంథంలా భావిస్తాను. మేనిఫెస్టో లో ఉన్న అంశాలను అమలయ్యే లా చూస్తాం. విశ్వసనీయతకు ప్రజలు పట్టంగట్టారు. విశ్వసనీయత సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తాం. కేంద్రంపై ఇంతగా ఆధారపడాల్సిన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. రాష్ట్రాన్ని బాగా నడపాలనే తపన నాకు ఉంది. కాని రాష్ట్రానికి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి" అని జగన్ పేర్కొన్నారు.