కొన్ని మీడియా సంస్థలు పేరుకే గొప్పగా ఉంటాయి కానీ స్వార్థపు ఆలోచనల్లో వాటిని మించినవి ఉండవని తెలుగు నేలపై ఉన్న మనందరికీ తెలిసిన ముచ్చటే. అవసరార్థం వార్తలు రాసే, అజెండాలు మార్చుకునే అలాంటి సంస్థల జాబితాలోనే తాజాగా అంతర్జాతీయ పేరొందిన `టైమ్` మ్యాగజైన్ చేరింది. భారత విభజన సారథి అని కొద్ది వారాల క్రితం ప్రధాని నరేంద్రమోదీపై వివాదాస్పద శీర్షికన కవర్ స్టోరీ ప్రచురించిన ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తాజాగా తన స్వరం మార్చింది. కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రధానికీ సాధ్యం కాని రీతిలో మోదీ భారత్ను ఏకం చేశారని తాజా ఆర్టికల్లో ప్రశంసించింది.లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన కొద్దిరోజులకే టైమ్ మ్యాగజైన్ ఈ కథనం ప్రచురించడం గమనార్హం.
కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా ఇంక్ గ్రూప్ మీడియా సంస్థ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనోజ్ లాద్వా .. దశాబ్దాలుగా ఏ ప్రధాని చేయలేని విధంగా మోదీ భారత్ను ఏకం చేశారు అనే శీర్షికన ఈ వ్యాసం రాశారు. మోదీ విధానాలపై ఆయన పదవీకాలంలోనూ, ఎన్నికల సమయంలోనూ తీవ్రమైన, పలుమార్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. గత ఐదు దశాబ్దాలలో ఏ ప్రధానికీ సాధ్యం కాని రీతిలో మోదీ భారత ఓటర్లను ఏకం చేశారు అని లాద్వా రాశా రు. 2014 ఎన్నికల్లో మోదీ తరఫున రీసె ర్చ్ అనాలిసిస్ అండ్ మెసేజింగ్ డివిజన్కు లాద్వా సారథ్యం వహించారు. భారత్కు రెండోసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు. ఐదేళ్లుగా భారత్లోని అసమర్థ, అవినీతి బ్యూరోక్రసీలో లొసుగులకు చరమగీతం పాడిన మోదీ.. ఈసారి వ్యవస్థలను సంస్కరించి, రానున్న దశాబ్దాలకు అనుగణంగా తీర్చిదిద్దడంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ స్వప్నిస్తున్న నవభారతానికే ఓటర్లు ప్రాధాన్యమిచ్చారని విశ్లేషించారు.
ఇదిలాఉండగా, 2010-13 మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా బాధ్యతలు నిర్వహించిన ఫెలో అలిస్సా ఐర్స్ మరో కథనం రాశారు. `భారత ఆర్థిక వ్యవస్థకు కఠిన సంస్కరణలు అవసరం: ప్రజాతీర్పును మోదీ ఎలా వినియోగించుకుంటారు?` అనే శీర్షికతో మరో కథనం టైమ్ వెబ్సైట్లో ప్రచురించారు. మోదీ పారిశ్రామిక అనుకూల దృక్పథం వల్ల అమెరికా పారిశ్రామిక వర్గాల్లో సంస్కరణవాదిగా పేరొందారన్నారు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సంస్థలో ఇండియా, పాకిస్థాన్, దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ ఫెలోగా ప్రస్తుతం అలిస్సా ఐర్స్ పనిచేస్తున్నారు.