ఏదెలా ఉన్నా జగన్మోహన్రెడ్డి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చి తిరిగి ఏపీ ప్రజల మనస్సులను గెలుచుకోవాలంటే జగన్కు ఇప్పుడు సమర్థులు అయిన అధికారుల అండదండలు తప్పనిసరి. చంద్రబాబుకు ఈ సారి సీనియర్ అధికారులను సమన్వయం చేసుకోవడం రాలేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు జగన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ఐదేళ్లలో అధికారులందరూ తనకు సహకరించేలా వారిని గ్రిప్లోకి తెచ్చుకోవాలి.
ఇదే క్రమంలో ఈ సారి చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలపై గ్రిప్ కోల్పోయారు. ఆయన మాట చాలా మంది ఎమ్మెల్యేలు వినకపోవడం కూడా ఈ సారి ఘోర ఓటమికి కారణమైంది. అలాగే కొంతమంది సీనియర్లకు టిక్కెట్లు ఇవ్వకూడదని బాబు అనుకున్నా వాళ్లు బెదిరించి మరీ టిక్కెట్లు తీసుకుని ఓడిపోవడంతో పాటు పార్టీ ఓటమికి కారణమయ్యారు. ఇక ఇప్పుడు జగన్ ఐదేళ్ల పాటు పార్టీలో ప్రతి ఒక్కరిని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి.ఏపీలో తనకు సమర్థవంతమైన అధికారుల టీం కోసం స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ అధికారి లక్ష్మి, ఐపీఎస్ నాగిరెడ్డి, ఐఏఎస్ మల్లారెడ్డి వంటి వారిని తన టీంలోకి తీసుకోబోతున్నారు. వీరంతా కూడా గతంలో తన తండ్రి దివంగత వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అత్యంత ఆప్తులుగా ఉన్న వారే.
ఇక ఏపీ రాజధాని అమరావతి భూముల గోల్మాల్ బయటకు తీసే అంశాన్ని సైతం జగన్ ఇప్పటికే అధికారులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో మంత్రి వర్గంలో తన వెంట ఉన్నవారిని కాకుండా ప్రజల్లో ఆదరణ ఉండడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండే వారినే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా జగన్ ఈ ఐదేళ్ల పాటు పాలనా పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని రావాలన్నా, సంస్కరణలు తేవాలన్నా... అటు అధికారులతో పాటు మంత్రులు, తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమన్వయంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడే జగన్ సక్సెస్ ఆధారపడి ఉంది.