ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రిర్గ సహచరులకు కట్టబెట్టే శాఖలపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. తొలి విడతలో కేబినెట్ లోకి 60 మంది వరకు తీసుకునే అవకాశం కనిపిస్తుండగా..బీజేపీ మిత్రపక్షాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్లో బెర్త్ దక్కవచ్చని తెలుస్తోంది. బీజేపీ నుంచి కీలక మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, బెంగాల్ , గోవా, ఢిల్లీ, కర్ణాటకలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు.
బీజేపీ చీఫ్ అమిత్ షా మోడీ టీంలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. అమిత్ షాను కేబినెట్ లోకి తీసుకుంటే ఆయనకు హోంశాఖ ఇచ్చి ప్రస్తుత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. పియూష్ గోయల్ కు ఆర్థికశాఖ ఇవ్వొచ్చని తెలుస్తోంది. జయంత్ సిన్హా పేరు కూడా వినిపిస్తోంది. సుష్మాస్వరాజ్ కు రెస్ట్ ఇవ్వవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. స్మృతి ఇరానీ, రిజిజుకు ప్రమోషన్ దక్కే చాన్సుంది.
కేబినెట్ లోకి తనను తీసుకోవద్దని అరుణ్ జైట్లీ ఇప్పటికే.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. అతని ప్లేస్ ను ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాకు బీజేపీ పగ్గాలు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి ఇప్పటికే బెర్త్ ఖరారు అయిన నేపథ్యంలో...ఆయనకు ఏ శాఖ దక్కనుందనే చర్చ సాగుతోంది.
మహారాష్ట్రలో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన 18 ఎంపీ సీట్లు గెలుచుకుంది. బీహార్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 16 సీట్లు సాధించింది. యూపీలో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన అప్నాదళ్ పోటీ చేసిన రెండు సీట్లలో విజయం సాధించింది. ఈ సారి కేబినెట్లో శివసేన, జేడీయూకు రెండు మూడు కేబినెట్ బెర్త్లు ఖాయమని తెలుస్తోంది. అప్నాదళ్కు గత కేబినెట్లో ఇచ్చినట్లే ఈసారి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది.