ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీకి కావాల్సినంత మెజార్టీ కట్టబెట్టారు ప్రజలు. మెజార్టీకి అవసరమైన సీట్లే కాకుండా ఏకంగా డబుల్ మెజార్టీకి కాస్త దగ్గరగా సీట్లు వచ్చాయి. ఇక ఇప్పుడు టీడీపీలో చాలా మందికి వాళ్ల భవిష్యత్తు ఏంటో ? టీడీపీ భవిష్యత్తు ఏంటో ? కూడా అర్థం కావడం లేదు. లోకేష్ను నమ్ముకుంటే పనులు కావని డిసైడ్ అయిన నేతలంతా ఇప్పుడు తమను తాము కాపాడుకునే క్రమంలో కమలం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అదనుగా ఏపీలో టీడీపీని మరింతగా భూస్థాపితం చేసేయాలన్న ప్లాన్తో ఉన్న బీజేపీ టీడీపీలో కాస్త సీనియర్లు, మంచివాళ్లుగా పేరున్న నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
టీడీపీలో చాలా మంది వైసీపీ నుంచి ఆఫర్ వస్తే చెక్కేద్దామన్న ప్లాన్తో ఉన్నారు. ఇక జగన్కు గెలిచిన వారితోనే పనిలేనప్పుడు... ఓడిన వారిని దగ్గరకు ఎందుకు రానిస్తాడు.. పైగా తాను ముందునుంచి ఇతర పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చేటప్పుడు ఆ పార్టీ ద్వారా లభించిన పదవులును వదులుకోవాలని చెపుతున్నాడు. ఈ మాటే ఆయనకు క్రేజ్ తెచ్చింది. అసలు జగన్ రాజకీయ వెలుగే ఈ మాటతో ప్రారంభమైంది. 2012 ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పదవులను వదులుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు టీడీపీ నుంచి ఓడిన వారి దారులు కమలం వైపు ఉంటే... కమలం ఏపీ టీడీపీని పూర్తిగా కబ్జా చేస్తే ఎలా ? ఉంటుందన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నాశనం అవ్వడంతో ఠక్కున టీడీపీలో చేరి పదవులు అనుభవించిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారట. ఇక కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి చూపులు కూడా బీజేపీ వైపే ఉన్నాయంటున్నారు. ఇక గుంటూరు జిల్లాలో ఓ మాజీ మంత్రితో పాటు పల్నాడుకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కూడా తమపై కేసులు లేకుండా, ఇక్కడ వైసీపీ ఎటాక్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరతారన్న ప్రచారం జిల్లాలో జోరుగా నడుస్తోంది.
ఇక ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలది కూడా కాషాయ దారే అంటున్నారు. ఏపీలో ఇప్పుడు ఇలాంటోళ్లపైనే బీజేపీ కన్ను ఉందట. ఇక్కడ పార్టీ పటిష్టత కోసం కొంతమంది సీనియర్ నేతల అవసరం ఆ పార్టీకి ఉంది. అందుకే వీళ్లకు తమ పార్టీలో పునరావాసం కల్పించనుంది. ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే వాళ్లకు బీజేపీపై ఎంత మాత్రం ప్రేమ ఉండదు.. ఇక్కడ వైసీపీ ఎటాక్ నుంచి తప్పించుకోవడమే వీళ్ల లక్ష్యం. జగన్ ఎలాగూ వీళ్లను చేర్చుకోరు. తెలుగుదేశం పార్టీలో వీరు ఉండలేరు. మళ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే వీళ్లకు ఇప్పుడు కాషాయ జెండా ఒక్కటే దిక్కుగా ఉంది.