ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి చిరకాలస్వప్నం సాకారం అయింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ జగన్ ప్రయత్నించినా, అవి ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టిన జగన్మోహనరెడ్డి, 2014 ఎన్నికల్లో అధికారంలో రావడానికి ప్రయత్నించారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు.
తాజా ఎన్నికల్లో మాత్రం వైసీపీ ప్రభంజనం జగన్మోహనరెడ్డికి కూడా ఒక అవకాశం ఇద్దాం! అంటూ అశేష ఆంధ్రప్రదేశ్ జనావళి తమ మాండేట్ తో కుమ్మేయటంతో టీడీపీ చతికిల బడింది. మొత్తం 175 స్థానాల శాసనసభకు 150 స్థానాలకు తమ అభ్యర్ధులను గెలిపించి వైసిపి అనితర సాధ్యమైన విజయం సాధించింది. దీంతో ఏపీ రెండో సీఎం గా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారే గానీ ఆయన ముఖంలో సంతోషం లేదని చెప్పాలి. దానికి కారణం పోతూపోతూ చంద్రబాబు అందించిన ఖాళీ ఖజానా - రాష్ట్ర ఆర్థిక పరిస్థితే. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్మోహనరెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి అప్పులు ₹ 55000 కోట్లు ఉండగా, ప్రస్తుతం అవి ₹ 248000 కోట్లకు చేరాయని అన్నారు. ఆర్థికలోటుకు తగినట్లు ఆదాయ వనరులు లేకపోవడంతో సంక్షేమ పథకాలు అమలు, ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కొత్త ప్రభుత్వానికి ఒక రకంగా ముళ్ల కిరీటమే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ముందు రెండు సవాళ్లు ఉన్నాయి.
*ఒకటి రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచీ బయటపడెయ్యడం,
*రెండోది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం.
*యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రోజెక్ట్ ను పూర్తిచేయటం
వీటిని ఎలాగైనా అధిగమించాలని భావిస్తోన్న జగన్మోహనరెడ్డి వీలైనంత వరకూ ఖర్చులు తగ్గించు కోవాలని అనుకుంటున్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకూ అందరికీ ఇదే విషయం గట్టిగా చెప్పి, అందరూ దీనిని సక్రమంగా పాటించాలని కోరినట్లు సమాచారం.
ఇదే అంశంపై నగరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆర్కే రోజా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి తలచుకుంటే విలాసవంతంగా ఉండొచ్చు కానీ, ఆయన అందుకు సిద్ధంగా లేరని, దీనికి కారణం పొదుపు మంత్రం మాత్రమేనని అన్నారు. చంద్రబాబులా వైఎస్ జగన్మోహనరెడ్డి దుబారా ఖర్చులు చెయ్యరని, గత సీఎం తప్పిదాలతో రాష్ట్రం భారీ లోటు బడ్జెట్లో ఉందని రోజా పేర్కొన్నారు. తమ నేత జగన్మోహనరెడ్డి ప్రతి రూపాయి ఖర్చుకు జవాబు దారీ ఉంటారని, అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా సాదా సీదాగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నెలకు ₹421000 తీసుకుంటుండగా, మాజీ సీఎం చంద్రబాబు ₹240000 వేతనం తీసుకునేవారని, జగన్ మాత్రం నెలకు రూపాయి మాత్రమే తీసు కుంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఖర్చుల విషయంలో తాను ఎంత సీరియస్గా ఉన్నదీ సీఎం కాక ముందే సంకేతాలు పంపారు. అలాగే నేతలు, అధికారులూ అనవసర ఖర్చులను తగ్గించుకుంటే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయనీ, వాటిని సంక్షేమ పథకాల కోసం ఉపయోగించవచ్చని జగన్మోహనరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.ఇందులో భాగంగానే తన పర్యటనలకు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లను అత్యవసరమైతే తప్ప, వీలైనంత మేరకు వినియోగించరాదని జగన్మోహనరెడ్డి నిర్ణయించు కున్నట్లు సమాచారం.
అలాగే స్టార్-హోటళ్లలో బస, పదే పదే విదేశీ పర్యటనలు జగన్మోహనరెడ్డి చెయ్యరని తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ఆదర్శంగా తీసుకుంటారని సమాచారం. నవీన్ పట్నాయక్ పొదుపు మంత్రాన్ని జపిస్తూ, నరేంద్ర మోడీ రెండు ప్రభంజనాలను తట్టుకొని మరీ చెక్కుచెదరని అభిమానం తో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
అత్యంత సామాన్యంగా ఉండే ఆయనకు ప్రజలు వరుసగా ఐదోసారి పట్టంకట్టారంటే అర్థం చేసుకోవచ్చు. జగన్మోహనరెడ్డి కూడా ఆ బాటలో నడవాలను కుంటున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. నిజంగా చెప్పాలంటే ‘పొదుపు మంత్రం’ కష్ట కాలంలో ఎన్నో కార్పోరేట్ లను గట్టెక్కించింది.