లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దారుణమైన ఫలితాలు వచ్చాయి. కనీసం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనైనా గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రాలేదు. ఇక రాజస్థాన్ పరిస్థితి మరీ దారుణం. అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా.. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కూడా దారుణంగా ఓడిపోయాడు. అయితే ఎన్నికల తర్వాత జరిగే పోస్టు మార్టంలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఆధిపత్య పోరు కూడా పార్టీ ఘోర పరాజయానికి కారణమని తెలుస్తోంది.
తన కుమారుడు వైభవ్ ఓడిపోవడానికి కారణం డిప్యూటీ సీఎం సచిన్ పైలటే కారణమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అంటున్నారు. గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్ చేతిలో 2.7 లక్షల తేడాతో ఓడిపోయాడు. వాస్తవానికి వైభవ్ పోటీ చేసిన ఎంపీ స్థానం పరిధిలోని ఆరు ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి.
జోథ్పూర్లో మాకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేమే గెలుస్తామంటూ సచిన్ పైలట్ తనతో చెప్పినట్టు అశోక్ గెహ్లాట్ అంటున్నారు. కాబట్టి సచిన్ పైలట్ కనీసం నా కుమారుడు పోటీచేసి ఓడిపోయిన జోథ్పూర్ స్థానానికి అయినా బాధ్యత తీసుకోవాలని విమర్శిస్తున్నారు.