ఉత్తర ప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీల బంధం ముక్కలైంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో, అంతకు ముందు జరిగిన పలు ఉపఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఉపఎన్నికల్లో అవి ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించాయి. కొన్ని రాజకీయ ఒత్తిళ్లకారణంగా తాము ఒంటరి గా పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఈ ప్రకటన పై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ తాము కూడా ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమేనని చెప్పారు.
మాయావతి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడిన తరువాత అఖిలేశ్, ఆయన భార్య డింపుల్ నాకు ఎంతో గౌరవమిచ్చారు. నేను కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మా మధ్యనున్న విభేదాల న్నింటినీ మరిచిపోయి వారిని గౌరవించాను. మా అనుబంధం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అది ఎప్పటికీ కొనసాగుతుంది అని చెప్పారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తమ కూటమి అవమానకరమైన రీతిలో ఓటమి పాలవడానికి గల కారణాలపై ఆమె మాట్లాడుతూ, కొన్ని రాజకీయ ఒత్తిళ్లను నిర్లక్ష్యం చేయలేం. లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి మూలాధారమైన యాదవుల ఓట్లు మాకు లభించ లేదు. ఎస్పీకి చెందిన బలమైన అభ్యర్థులు సైతంఓటమిని చవి చూశారు అని చెప్పారు.
అసెంబ్లీ ఉపఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలోకి దిగనున్నామని తెలిపిన మాయావతి మహాకూటమి నుంచి బయటకు వస్తు న్నట్టు మాత్రం చెప్పలేదు. ఇవి శాశ్వతమైన తెగదెంపులు కావు. భవిష్యత్తులో ఎస్పీ అధినేత రాజకీయంగా విజయవంటం అవుతారని మేము భావిస్తే, మళ్లీ ఆయనతో కలిసిపనిచేస్తాం. ఆయన విజయవంతం కాలేక పోతే, మేము వేర్వేరుగా ఉండటమే మంచిది. అందుకే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించాం అని మాయావతి వివరించారు.
మాయావతి ప్రకటనపై అఖిలేష్ లక్నోలో స్పందిస్తూ, కూటమి ముక్కలై ఉంటే, దానిపై లోతుగా సమీక్షిస్తాం. వచ్చే ఉపఎన్నిక ల్లో కూటమి లేకపోతే, అప్పుడు సమాజ్ వాదీ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమవుతుంది. మొత్తం 11 సీట్లలో మేము ఒంటరిగా బరిలోకి దిగుతాం అని చెప్పారు.