ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవయువకుడు వైసిపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రజలు నిండుగా ఆధిఖ్యతనిస్తూ ఎదురులేకుంటా మరెవరూ ఆయన దరిచూడ కుండా అద్భుత విజయం కట్టబెట్టారు. అయినా ఈ ఘనతర విజయం ఏ స్వామీజి అనుగ్రహంతోనో లభించింది అని అనుకోవటం, వివిధ మతాల ప్రార్ధనాలయాలు అంటే దేవాలయాలు, మసీదులు, చర్చెస్ వెంటబడి తిరగటం ఈ ఆధునిక యుగంలో ఈ నవ యువకునికి విఙ్జత అనిపించుకోదు.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మధ్య మైత్రి బంధం మరీ మరీ బలపడుతుంది. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల తరుణంలో చిగురించిన వీరి స్నేహ బంధం క్రమక్రమంగా పటిష్టం అవుతోంది. అప్పుడు తెలంగాణలో వైఎస్ జగన్ పరోక్షంగా టీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు, ఇక, ఏపీ ఎన్నికల్లోనైతే బహిరంగంగానే కేసీఆర్, వైసీపీ గెలుపును కోరుకున్నారు. అంతే కాదు జగన్ ప్రమాణ స్వీకారానికి ఒక తండ్రి స్థాయిలో నిలబడి ఆ కార్యక్రమం దగ్గరుండి వీక్షించారు కేసీఆర్. వీరి మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలంగాణ లోని ఏపీకి చెందిన భవనాల ను ఆ రాష్ట్రానికి అప్పగించేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వీరి మధ్య ఇలాంటి స్నేహ బంధానికి కారణం ఇద్దరు వ్యక్తులట.
కేసీఆర్ కు మూఢనమ్మకాలు ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఏవరో చేప్పారని ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా సచివాలయం ముఖం చూడని మూడనమ్మక శిఖామణి ఆయన. ఏపని చేసినా స్వామీజీల సలహాలు, జ్యోతిష్కుడి సూచనలు పాటిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఆయనకు విశాఖలోని స్వరూపానందేంద్రస్వామి, హైదరాబాద్ లోని చినజీయర్ స్వామి గురుదేవులుగా వీరికి బాగాదగ్గరయ్యారు. కేసీఆర్ కు ఏంకావాలన్నా వీరిద్దరే చూసుకుంటారు. స్వరూపానందేంద్ర స్వామి విశాఖలో ఉంటారు కాబట్టి, ఎక్కువగా చినజీయర్ తోనే చర్చలు జరుపుతారు. వాళ్ల అదేశానుసారమే పని చేస్తుంటారు. ఇప్పుడిదే పరిస్థితి ఏపీ సీఎం జగన్ లో కనిపిస్తోంది. ఆయన కొద్ది రోజులుగా కేసీఆర్ ను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎక్కువగా నమ్మే ఆ స్వామీజీలను కలుస్తున్నారు. వీరిద్దరి సలహా మేరకే ఎన్నికలకు ముందు జగన్ హిందూమతం స్వీకరించారు. గెలుపు కోసం రహస్యంగా రాజశ్యామలయాగం కూడా చేయించారు.
దీనికి తగ్గట్లే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని వైసీపీ నాలుగు దశాబ్ధాల సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీని శంకరగిరి మాన్యాలు పట్టించి, అనితరసాధ్యమైన అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి స్వామీజీలను వైఎస్ జగన్ ఎంతగానో నమ్ముతున్నారు, ఆరాధిస్తున్నారు. ఆఙ్జలు స్వీకరిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి కూడా వారు పెట్టిన ముహూర్తాన్నే అనుసరించారు.
దీంతో ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల చాదస్తం, మూఢవిశ్వాసాల మూలంగా ఈ స్వామిజీల ఆశ్రమాలు అధికార కేంద్రాలైన తీరు అగమ్యగోచరం. వీరి హవా వీస్తుంది ప్రభంజనంలాగా! తెలంగాణకు చినజీయర్, ఆంధ్రప్రదేశ్ కు స్వరూపానందేంద్రలు "రాజగురువులు" అయిపోయారు. అందుకే ఇకపై వారేది చెబితే అదే పాలనాపరమైన సాంప్రదాయంగా మారే పరిస్థితులు తలెత్తే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల్లోని ప్రజలు స్పష్టంగా గుర్తించారు కూడా. చాలా మంది సోషల్-మీడియా వేదికపై ఇదే రకమైన కామెంట్స్ తో పాటు పోస్టింగులు పెడుతున్నారు. అంటే ఈ స్వాములు రానున్న కాలంలో రాజ్యాంగేతర శక్తులుగామారే ప్రమాదం కనిపిస్తుంది. అదే జరిగితే అది ప్రజలకు ప్రమోదంగాని అమూదయొగ్యం గాని కావు.
సీఎం గారు! మిమ్మల్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు సుధృఢంగా నమ్ముకోండి - లేకుంటే మీ రాజ్యం గుత్తేదార్ల భొగ్యంగా మారే సూచనలున్నాయని గమనించండి. అన్ని మతాలకన్నా "మానవత్వం" అందరు స్వాముల కన్నా మీ ప్రజలే మీ దైవాలైతే మీకు ఎదురే ఉండదు.