ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత వల్ల ఘోర పరాజయం పాలైన చంద్రబాబు మరోమారు ప్రజల ద్వారా నిరసనలు ఎదుర్కునే ప్రమాదం ఉందని గ్రహించి ముందే సర్దుకున్నారు. సర్వం సిద్ధం చేసుకున్నప్పటికీ....ఆఖరి నిమిషంలో తన విదేశీ పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 12వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నారు. రెండో శాసనసభ తొలి విడత సమావేశాలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్.. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది.
ఇంతటి ముఖ్యమైన ఘట్టం ఉన్నప్పటికీ....తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నేత అయిన చంద్రబాబు విదేశీ టూర్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుండి 13వరకు కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లాలని బాబు భావించారు. అయితే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నారు. 12వ తేదీనే అసెంబ్లీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బాబు టూర్ వాయిదా వేసుకున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నప్పటికీ....దేశంలోనే తనకంటే సీనియర్ నేత లేరని ప్రకటించుకునే చంద్రబాబు ప్రతిపక్ష హోదా దక్కడంతో మొహం చాటేస్తున్నారని...ప్రజా సమస్యలపై ఆయన చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పెద్ద ఎత్తున ప్రరచారం జరిగిన నేపథ్యంలో....ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.