ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఆ వెంటనే వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 7 తేదీన కేబినెట్ను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 13న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, 14న ఉభయ సభల సంయుక్త సమావేశం, శాసనసభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అలాగే శాసనమండలి సమావేశాలు ఈనెల 14 నుంచి మొదలుకానున్నాయి.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మొదలువుతున్న ఈ సమావేశాలు అనేక కీలక ఘట్టాలకు సాక్షిగా నిలవనున్నాయని చర్చించుకుంటున్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి హోదాలో జగన్..ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. కాగా, ఈ సమావేశాల్లో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు భాగస్వామ్యం లేని సంగతి తెలిసిందే. వైసీపీ, టీడీపీ కాకుండా కేవలం జనసేన సభ్యుడు ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ చీఫ్ విప్..విప్లను సైతం అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, స్పీకర్ పదవి ఎవరికి వరిస్తుందనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సైతం వేగంగా సన్నాహాలు సాగుతున్నాయి. మంత్రులకు శాఖలు ఇచ్చిన అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై, తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే విషయమై.. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందనే దానిపై స్పష్టత ఇవ్వడంపై జగన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.