ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో వైకాపా భారీ మెజారిటీతో విజయం సాధించింది. అనంతపురం జిలాల్లో టిడిపి గట్టి పోటీ ఇచ్చింది. అక్కడ తప్పించి మిగతా అన్ని ప్రాంతాల్లో వైకాపా విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే.
అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. ఎంత ఫ్యాక్షన్ లేదు అనుకున్నా... ఏదో ఒక సమయంలో ఫ్యాక్షన్ రాజకీయాలు బయటకు వస్తాయి. ప్రతిపక్షంలో పార్టీలోని కార్యకర్తలకు, నాయకులకు సేఫ్టీ ఉండదు. అందుకే అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మారాలని చూస్తున్నారు.
వైకాపాలోకి వెళ్లే ఆలోచన ఆ పార్టీ నాయకులకు లేదు. ఎందుకంటే వైకాపాలో జాయిన్ అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాళ్లకు సేఫ్ జోన్ కావాలి. ఆ సేఫ్ జోన్ కేవలం బీజేపీలో మాత్రమే ఉన్నది. అందుకే రాయలసీమ టిడిపి నేతల దృష్టి బీజేపీపై పడింది.
అనంతపురం జిల్లాలోని ప్రముఖ నాయకులుగా పేరు తెచ్చుకున్న జేసి బ్రదర్, పల్లె రఘునాధ రెడ్డి, పరిటాల కుటుంబం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ప్రముఖ నాయకులు త్వరలోనే ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23 లేదా 27 వ తేదీన బీజేపీలో జాయిన్ అవుతారని వార్తలు వస్తున్నాయి. సో, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అడుగులు అనంతపురం నుంచి మొదలవ్వబోతున్నాయన్నమాట.